హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండ్ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. ఏడేండ్ల క్రితం అతని వద్ద రూ.50 లక్షల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇప్పుడు అతని ఆస్తులు చూసి అవాక్కవుతున్నారు. గత ఏడేండ్లలో ఆ అధికారి సుమారు రూ.300 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు చెప్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డివిజనల్ ఇంజినీర్ ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన ఇండ్లు, ఆఫీసులు, బంధువుల నివాసాలలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాలలో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన డబ్బు, బంగారం, ఫ్లాట్లు, ప్లాట్లు, భవనాలకు చెందిన పత్రాలు, లగ్జరీ కార్లు, వాచ్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. అతడి భార్య పేరుమీద సైతం నాలుగు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉండగా, వాటి ద్వారా నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కనుగొన్నారు. మొత్తంగా అతని వద్ద లభించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ముత్యం వెంకటరమణపై ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు కేసు నమోదు చేశారు. అతని గురించి అంతా ఆరా తీసిన తర్వాత బుధవారం ఉదయం ఏకకాలంలో సదరు అధికారి ఇల్లు, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో విసృ్తత సోదాలు నిర్వహించారు.
కండ్లు చెదిరే ఆస్తులు!
సోదాల సందర్భంగా ముత్యం వెంకటరమణ స్థిర, చరాస్తులు చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. ఈ సోదాల్లో అధికారిక విలువ ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య పెట్టుబడులు పెట్టిన నాలుగు నిర్మాణ కంపెనీల్లో వాటాలు కలుపుకొంటే మొత్తం అక్రమాస్తుల విలువ బహిరంగ మారెట్లో రూ.300 కోట్లను సులువుగా మించిపోతుందని ఏసీబీ వర్గాలు చెప్పాయి. అతడి నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52,02,585 నగదును జప్తు చేశారు. వీటితో పాటు సుమారు రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, ఖరీదైన విదేశీ గడియారాలు, 19 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆరేండ్ల క్రితం..
వెంకటరమణ 2019 డిసెంబర్ 12న రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికాడు. ఆ సందర్భంగా అతడి ఇంట్లో సోదాలు చేయగా రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. పాత, తాజా మొత్తం అక్రమాస్తుల విలువ రూ.28,14,14,700గా ఏసీబీ నిర్ధారించింది. ప్రస్తుతం వెంకటరమణను తమ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఉదయం కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
ముత్యం బంధువు ఇంట్లో సోదాలు
పాల్వంచ: వెంకటరమణ సమీప బంధువు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని రాహుల్గాంధీనగర్ నివాసి రాజు తాసిల్దారి ఇంట్లో కూడా ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్ మాదాపూర్లోని డీఈ వెంకటరమణ ఇంట్లో సోదాలు కొనసాగుతున్న సమయంలోనే పాల్వంచలో సైతం తనిఖీలు చేపట్టారు. అయితే పాల్వంచలోని ఆయన బంధువు ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ డీఎస్పీ రమేశ్ పేర్కొన్నారు.