ఖిలావరంగల్, ఏప్రిల్ 22 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు. మంగళవారం రష్యా సోషలిస్టు విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ 145వ జయంతి, సీపీఐ ఎంఎల్ పార్టీ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖిలా వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మన దేశానికి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తో మోడీ దేశానికి అవమానకరమైన ఒప్పందాలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల జీవితాలతో దురంకార ట్రంప్ చెలగాటమాడుతుంటే ఇక్కడ మోదీ మాత్రం జీడి వ్యాన్స్ పిల్లలతో ఆటలాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాడని ఆరోపించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్, బండి కోటేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భైరబోయిన ఐలయ్య, పివైఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, రాజేష్, గద్దల ప్రభాకర్, ఎండీ ఖాన్, పాలకుర్తి సత్యనారాయణ, ఇనుముల కృష్ణ, సుద్దాల వీరన్న, బండి రవి, మన్నే కరుణాకర్,అయితే యాకయ్య రాతి పెళ్లి కృష్ణ, ఎండీ అక్బర్, పుప్పాల రవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.