హుస్నాబాద్, నవంబర్ 13 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు ప్రజలే అధిష్టానమని, ప్రజల అభీష్టం మేరకే పరిపాలన కొనసాగించడం జరుగుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీయే అధిష్టానంగా ఉండి అక్కడి నాయకుల అభీష్టం మేరకే పరిపాలన కొనసాగుతున్నదని, ఇలాంటి పార్టీలకు ఓటేస్తే హుస్నాబాద్ లాంటి పట్టణాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ఆయన ప్రజలను అడిగారు. తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ కావాలో… పదవుల కోసం కొట్లాడుకుని అభివృద్ధిని పట్టించుకుని పార్టీల నాయకులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఎవరో చెప్పుకోలేని వాళ్లు వచ్చి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసే కుట్రలు చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 4, 16వ వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగునా మహిళలు బొట్టు పెట్టి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అక్కన్నపేట రోడ్డులో జరిగిన రోడ్షోలో సతీశ్కుమార్ మాట్లాడుతూ 2014కు ముందు హుస్నాబాద్ పట్టణం ఎలా ఉం డేది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మళ్లీ గెలిస్తే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో పట్టణం ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే పట్టణానికి రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. హుస్నాబాద్ పేరు దేశమంతటా మార్మోగిందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో హుస్నాబాద్ పట్టణ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని, ఈసారి కూడా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే హుస్నాబాద్ పట్టణాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పడం, ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధే జరగలేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజనీతిరుతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, కౌన్సిలర్లు జనగామ రత్నమాల, పెరుక భాగ్యరెడ్డి, గూల్ల రాజు, వాల సుప్రజ, బోజు రమారవి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ అన్వర్, ఇంద్రనీల్బాబు, క్రాంతిరెడ్డి, చిరంజీవి, విజయభాస్కర్, పరశురామ్, ఆయా వార్డుల ఇన్చార్జిలు, బూత్కమిటీ సభ్యులు, యూత్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.