వాజేడు, నవంబర్, 14 : ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం ఇక్కడే తిరుగుతున్న ఓ పులి.. ఇటీవల బిజినేపల్లి గ్రామానికి చెందిన కుర్సం సారయ్య ఇంటి వద్ద మేకల మందపై దాడి చేసింది. అందులోని ఒక మేకను నోటకర్చుకోవడం చూసి గ్రామస్తులు కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం మూడు చిరుత పులులు వచ్చాయి. అవి శ్యామల రమేశ్ ఇంటి మీదుగా మక్కజొన్న చేన్ల నుంచి గొర్రెలు ఉంటున్న ప్రదేశానికి వెళ్లాయి. అక్కడ గొర్రెల కాపరులు, కాపలా కుక్కలు ఉండడం చూసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి.
తిరిగి రాత్రివేళ గ్రామాల వైపు వస్తుండడంతో బిజినేపల్లి, మొరుమురు గ్రామాల ప్రజలు భయందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న దూలపురం రేంజ్ అధికారులు సోమవారం బిజినేపల్లి గ్రామానికి చేరుకోగా చిరుత సంచరించిన ప్రాంతాలు, వాటి పాదముద్రలు, ఆనవాళ్లను చూపించి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతలను దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయాలని కోరారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని దూలపురం రేంజ్ ఆఫీసర్ అనంతరామిరెడ్డి సూచించారు. పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ పూసం నరేశ్కుమార్ గ్రామంలో దండోరా వేయించారు.
మేకను ఎత్తుకెళ్లడం కండ్లారా చూసిన..
చిరుతపులి మా ఇంటి దగ్గరికి వచ్చింది. మేకల మందపైకి దునికి ఓ మేకను కొరికి ఎత్తుకొని అడవిలోకి వెళ్లిపోయింది. నా ముందునుంచే పులి పోవడం కండ్లారా చూసిన. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పినం. మొన్నటినుంచి రోజుకో కాడికి చిరుత పులి వచ్చి మమ్ముల ఆగంజేత్తాంది. రాత్రి అయిందంటే భయమైతాంది.
– కుర్సం సారయ్య, ప్రత్యక్షసాక్షి, బిజినేపల్లి
భయంభయంగా ఉంది
ఊళ్లోకి చిరుత పులులు వస్తున్నయని తెలిసినప్పటి నుంచి భయంభయంగా ఉంది. పశువులను చంపి తింటున్నాయి ఎప్పుడు ఎటునుంచి వస్తుందోనని ఊరి జనమంతా ఆగమైతున్నరు. అధికారులు చిరుతల బారి నుంచి కాపాడాలె. – శ్యామల పాపారావు