సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నగరంలో ఓటు నమోదు చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదు. సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ కోసం సమయాన్ని రెండు సార్లు పెంచినా సిటీ జనం ఇక్కడ తమ ఓటును నమోదు చేసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడటంలేదు. ఓటర్ల వివరాలను బీఎల్వోలకు ఇచ్చేందుకు దాదాపు నెలన్నర సమయం ఇచ్చినా ఇప్పటిదాకా 60 శాతం మార్కును చేరుకోలేదు. మహానగరంలోని జనాభాలో దాదాపు 60 శాతం మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వారే ఉన్నారు. అందులో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని స్వగ్రామాలతో సంబంధాలను కోల్పోయిన వారు మాత్రమే ఇక్కడి స్థానికతను కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వలస వచ్చిన వారు సొంతూళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
సర్ ప్రక్రియలో గడువు ఇంకా ఒక్కరోజే ఉన్నా ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ మాత్రం 58 శాతానికే పరిమితమైంది. దీంతో నగరంలోని మెజారిటీ ప్రజలు సొంతూళ్లలోనే తమ ఓటు ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. సర్ ప్రక్రియకు గడువును తొలుత జూలై 25 నుంచి ఆగస్టు 3కు పెంచారు. అయినా ఎన్యుమరేషన్, డిజిటైజేషన్లో వేగం లేకపోవడంతో రెండోసారి ఆగస్టు 10 వరకు పొడిగించారు. అయినా సిటీ జనాలు తమ వివరాలను నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. గడువు రేపటితో ముగుస్తుండటంతో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ 60 శాతం మార్కును దాటే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
రాష్ట్రంలోనే సిటీ లాస్ట్…
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల డిజిటైజేషన్లో హైదరాబాద్ జిల్లా ముందు నుంచే వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా సిటీలో ఉన్న ప్రజలంతా ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడటంతో తమ ఓటును ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియక ఇన్నాళ్లు తికమక పడ్డారు. ఎన్యుమరేషన్కు గడువు పూర్తవుతుండంతో సిటీ ఓటరు తమ సొంతూళ్లకే మొగ్గు చూపుతారనే స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇప్పటి వరకు డిజిటైజేషన్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో 90 శాతానికి చేరువలో ఉన్నాయి.
కొన్ని ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. శనివారం నాటికి హైదరాబాద్ జిల్లా 58.41 శాతంతో అన్ని జిల్లాల కంటే వెనుబడి అట్టడుగు స్థానానికి పరిమితమైంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి 63.79 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా 64.82 శాతానికి పరిమితమైంది. ఈ మూడు జిల్లాలు మినహాయిస్తే గ్రామీణ జిల్లాలన్నీ దాదాపు డిజిటైజేషన్ పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. సిటీలో 60 శాతం కంటే ఎక్కువ డిజిటైజేషన్ అయ్యే అవకాశాలు లేవని అధికారులే చెప్తున్నారు. మరోసారి గడువు పెంచినా ఎలాంటి ఉయోగం లేదని తేల్చేస్తున్నారు.