భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా హెచ్చరించారు.
మంచి వ్యవస్థ కోసం సహకరించాలి
సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషిస్తే చట్టపరమైన చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
సీపీగా బాధ్యతల స్వీకరణ
సుబేదారి, డిసెంబర్ 3: భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా హెచ్చరించారు. బదిలీ అయిన సీపీ తరుణ్జోషి నుంచి హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం రంగనాథ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసింగ్ తీసుకురావడానికి కృషిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, టీంవర్క్తో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
భూబాధితులు ఫిర్యాదు చేయాలి..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూసమస్య లు, మోసాలు ఎక్కువ ఉన్నట్లు తన దృష్టికి వచ్చింది, ఈ విషయంలో భూదందాలు, మోసాలకు పాల్పడే వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతాం, ఎవరినీ ఉపేక్షించేదిలేదని సీపీ రంగనాథ్ హెచ్చరించారు. అనవసరంగా భూ వివాదాల్లో జోక్యం చేసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు, భూబాధితులు ఎవరైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. విచారణతో ఏఎస్వోపీ అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నా రు. భూ దందాలో పోలీసుల ప్రమేయం ఉన్నా ఊరుకునేదిలేదని సీపీ స్పష్టం చేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా మతపరంగా , కులపరంగా, రాజకీయ పరంగా, వ్యక్తి గతంగా దూషిస్తే సహించేది లేదని రంగనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తులను టార్గెట్ చేసుకొని దూషించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో అనుబంధం..
తనకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో అనుబంధం ఉందని సీపీ రంగనాథ్ తెలిపారు. 2003-2004లో నర్సంపేట డీఎస్సీగా పనిచేశానని ఆయన గుర్తుచేశారు. అప్పుడు నక్సల్స్ సమస్య పరిష్కారానికి తనవంతు కృషిచేశానని చెప్పారు. అదే అనుభవంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచి పోలీసింగ్-మంచి వ్యవస్థ కోసం పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి కృషిచేస్తామని తెలిపారు. ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీ లు, మీడియా సహకారం అందించాలని సీసీ రంగనాథ్ కోరారు.
కొత్త సీపీని కలిసిన పోలీస్ అధికారులు
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిప ఏవీ రంగనాథ్ను కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలతో సీపీకి శుభాకాంక్షలు తెలిపారు. రంగనాథ్ను కలిసిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్కుమార్, సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్గైక్వాడ్, పుష్పారెడ్డి, సంజీవ, సురేశ్కుమార్, ఏసీపీలు కిరణ్కుమార్, శ్రీనివాస్, సంపత్రావు, శివరామయ్య, సీఐలు, ఎస్సైలు తదితరులు ఉన్నారు.