సుబేదారి, ఆగస్టు 16: ‘ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకును లీజుకు ఇచ్చేదిలేదు, అమ్మేది లేదు’ అని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. హనుమకొండ అదాలత్లోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కమర్షియల్ లీజు నిర్మాణ విషయంలో కొద్ది రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా గత పాలకవర్గం బ్యాంకు సముదాయంలో కొంత భాగాన్ని లీజుకివ్వడం, పాలకవర్గంలో డైరెక్టర్గా ఉన్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టడంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పాలకవర్గం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మంగళవారం సమావేశమైంది. ఈసమావేశంలో బ్యాంకు లీజు, కోర్టు కేసు, ప్రస్తుత లీజు, నిర్మాణ పనుల విషయంలో కాంట్రాక్టర్ చేపడుతున్న పనులు, పోలీసు కేసు, న్యాయ సలహాపై చర్చించారు. వివాదాన్ని వీలైనంత జాప్యం చేయకుండా పరిష్కరించాలి, ఇందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై పాలకవర్గం సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, నాలుగు అంశాలపై తీర్మానాలు చేశారు. బ్యాంకు లీజు డీడీకి సంబంధించి హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను వాదించడానికి బ్యాంకు అడ్వకేట్ రోహిత్ పోగలను తప్పించి, సీనియర్ న్యాయవాదిని నియమించాలని తీర్మానం చేశారు. బీఆర్ యాక్ట్కు విరుద్ధంగా బ్యాంకును లీజు ఇవ్వడంతో తలెత్తిన వివాదాలు పరిష్కరిచడానికి తగిన న్యాయ సలహా తీసుకొని, తదుపరి చర్యలు తీసుకోవడానికి బ్యాంకు సీఈవోకు అధికారం అప్పగించనున్నారు. బ్యాంకు ప్రధాన కార్యాలయ సముదాయం మొత్తాన్ని కేవలం బ్యాంకు నిర్వహణ, బ్యాంకు అవసరాలకు మాత్రమే వినియోగించాలి. బ్యాంకు ప్రధాన కార్యాలయ సముదాయం, అందులో కొంత భాగాన్ని ఎట్టి పరిస్థితిలో లీజుకు ఇవ్వకూడదని తీర్మానం చేసి పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, సభ్యులు కిక్కిరాల హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్రావు, కేశిరెడ్డి ఉపేందర్రెడ్డి, సంపెల్లి నరసింగరావు, జగన్మోహన్రావు, పోలేపాక శ్రీనివాస్, దొంగల రమేశ్, ఎర్రబెల్లి గోపాల్రావు, మాడుగుల రమేశ్, నాయిని రంజీత్ , నాబార్డు డీడీఎం రవికుమార్, బ్యాంకు సీఈవో చిన్నరావు, డీసీవో నాగేశ్వర్రావు, వీడియో కాన్ఫరెన్స్లో టెస్కాబ్ నోడల్ ఆఫీసర్ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ గత పాలక వర్గం డీసీసీ బ్యాంకును నిబంధనలకు విరుద్ధంగా లీజు ఇచ్చిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ మొండిగా వ్యవహరిస్తే పాలకవర్గం కూడా గట్టిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు.
భవనానికి తాళాలు వేసేందుకు యత్నం
డీసీసీబీ భవన లీజు నిర్మాణ పనులు జరుగుతున్న భవన షటర్లకు పాలకవర్గం తాళాలు వేస్తున్న క్రమంలో కాంట్రాక్టర్ కంది శ్రీనివాస్రెడ్డి, ఆయన సోదరుడు రవీందర్రెడ్డి అడ్డుకున్నారు. తనకు కోర్టు ఆర్డర్ ఉంది, ఏలెక్కన తాళాలు వేస్తారని పాలకవర్గం సభ్యులతో వాగ్వాదానికి దిగారు. లీజు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం, ఈ విషయంలో పాలకవర్గం కూడా లీజుకు ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పాలకవర్గ సభ్యులు కాంట్రాక్టర్తో వాదించారు. ఎట్టి పరిస్థితిలోనూ లీజుకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈక్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాదోపవాదనలు జరిగియి. సుబేదారి పోలీసులు ఇరువర్గాల వాదనలు విని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.