చెన్నారావుపేట, నవంబర్ 9: మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను గెలిపిస్తే డివిజన్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆరే గ్యారెంటీ సీఎం అని, ఎలాంటి గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు. మండలంలోని జల్లి, ఎల్లాయగూడెం, 16 చింతలతండా, చెరువుకొమ్ముతండా, బోడమాణిక్యంతండా, శంకరంతండా, బాపునగర్తండా, అవుసుల్తండా, కందిగడ్డతండా, లింగగిరి గ్రామాల్లో ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దికి ప్రజలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ప్రజా ఆశీస్సులతో ప్రచారం ఉప్పెనలా సాగింది. ప్రతి గ్రామం, తండాలో డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీలు నిర్వహించారు. దీంతో గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తన సొంత గ్రామానికి కూడా ఏమీ చేయలేదని ఎమ్మెల్యే పెద్ది ఎద్దేవా చేశారు. దొంతి లాంటి నాయకులు రాజకీయ పర్యాటకులే తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. కరోనా సమయంలో మాధవరెడ్డి ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదని విమర్శించారు. తాను నర్సంపేటలో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, ప్రజల బాగు కోసం అహర్నిశలు కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. అలాగే, తాను మారుమూల తండాలకు సైతం లింక్, బీటీరోడ్లు వేయించానని, మౌలిక వసతులు కల్పించానని వివరించారు. డీబీఎం-40 కాల్వ ద్వారా రెండు పంటలకు నీరందించానన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోతే ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ఇప్పించినట్లు గుర్తుచేశారు. 50 శాతం సబ్సిడీతో నియోజకవర్గంలోని రైతులకు రూ. 75 కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, పరికరాలు మంజూరు చేయించినట్లు వివరించారు.
మరోసారి మీ ఆశీస్సులు అందిస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రచార ర్యాలీలో ఎన్నికల ఇన్చార్జి రాయుడి రవీందర్రెడ్డి, జడ్పీటీసీ పత్తినాయక్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సీనియర్ నాయకుడు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్చార్జి వీరారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, యూత్ అధ్యక్షుడు కృష్ణచైతన్యరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, కిషన్, రమేశ్, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసి కుమారస్వామి, బోడ కల్పన, కడారి సాయిలు, సొసైటీ డైరెక్టర్లు, రైతు కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.