వర్ధన్నపేట, మార్చి 13 : రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది. రైతులు ఎన్ని రకాల పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ఏవోలు, ఏఈవోలు పంటలను పరిశీలించి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ధాన్యం దిగుబడి ఏ మేరకు వస్తుందనే అంచనా ఉంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం తేలికవుతుంది. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతే రైతులకు పరిహారం అందించడం, ధాన్యం పాడైపోకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసమే జిల్లాలోని 13 మండలాల్లోని పంటల వివరాలనును ఆన్లైన్లో నమోదు చేయించారు. వర్ధన్నపేట, నర్సంపేట డివిజన్లలో యాసంగిలో 2,21,368 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నమోదు ప్రక్రియ పూర్తి..
నర్సంపేట, వర్ధన్నపేట డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో పంటల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయింది. నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో వ్యవసాయ శాఖ వద్ద నామమాత్రంగా పంటల సాగు వివరాలు ఉండేవి. దీంతో యాసంగి, వానకాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బందులకు గురయ్యేవారు. ధాన్యం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, ప్యాడీ క్లీనర్లు, గిడ్డంగుల సమస్యలు వేధించేవి. కానీ రైతులు తమ పంట ఉత్పత్తులను ఏ మేరకు తీసుకువస్తారనే అంచనా ముందస్తుగానే ఉండడం వల్ల అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడానికి వీలవుతుంది. దీంతో రైతులకూ మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2 లక్షలు దాటిన సాగు విస్తీర్ణం..
యాసంగిలో 2,21,368 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. నర్సంపేట, వర్ధన్నపేట డివిజన్ల పరిధిలోని 59 క్లస్టర్లలో ఏఈవోలు ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియను పూర్తిచేసేందుకు రెండు నెలలు శ్రమించారు. భూమి సర్వే నంబర్, రైతు పేరు, సాగు చేస్తున్న పంటల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. నర్సంపేట డివిజన్లో 1,03,765 ఎకరాల్లో, వర్ధన్నపేట డివిజన్లో 1,17,368 ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. ఇందులో ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించి 1,563 ఎకరాల్లో టేకు, మలబార్, ఎర్రచందనం, వెదురు, సుబాబుల్ తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అలాగే 2,911 ఎకరాల్లో కూరగాయ పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు.
కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు..
రాష్ట్ర ప్రభుత్వం సాగు నీటి వసతిని మెరుగుపర్చడంతో రైతులు వరి, మక్కజొన్న పంటలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. నర్సంపేట, వర్ధన్నపేట డివిజన్ల పరిధిలోని చెరువుల కింద విస్తృతంగా సాగు చేశారు. చెరువులు దగ్గర లేని రైతులు బోర్లు, బావులపై ఆధారపడి పంటలను పండించుకుంటున్నారు. యాసంగిలో నర్సంపేట డివిజన్లో 46,809 ఎకరాల్లో వరి, 49,128 ఎకరాల్లో మక్కజొన్నను సాగు చేశారు. వర్ధన్నపేట డివిజన్లో 65,801 ఎకరాల్లో వరి, 39,287ఎకరాల్లో మక్కజొన్న వేశా. మరో నెల రోజుల్లో ఈ పంటల కోత ప్రారంభం కానున్నందున అధికారులు ఇందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆన్లైన్ నమోదుతో రైతులకు మేలు
– ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఆన్లైన్లో పంటల వివరాలను నమోదు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. పంటల కొనుగోలు, విపత్తు సమయంలో రైతులకు సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సాగునీటి వసతిని మెరుగుపర్చడంతో పాటు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నది. దీని వల్ల జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వరి, మక్కజొన్న పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున ఇందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి పంట క్షేత్ర వద్దకు వెళ్లి రైతు పేరు, భూమి సర్వే నంబర్, పంట వివరాలను సమగ్రంగా ఆన్లైన్లో నమోదు చేశాం.