నిండుకుండలా మారి మత్తడి పోస్తున్న సరస్సు
గోవిందరావుపేట, జూలై 12 : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్నవరం సరస్సు కళకళలాడుతోంది. మంగళవారం భారీగా వచ్చి చేరిన వరదతో నిండిపోయి మత్తడి పోస్తోంది. సరస్సు నీటి మట్టం 33.5 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి రెండగుల ఎత్తుతో పరవళ్లు తొక్కుతోంది.
సోమవారం రాత్రి వరకు 30 అడుగులు ఉండగా ఉదయానికల్లా మత్తడి పోస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండుకోవడంతో మండలంలోని రైతులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. సరస్సులో నీటి మట్టం పెరిగి అలలు వస్తుండడంతో టూరిజం శాఖ అధికారులు బోటు షికారు నిలిపివేశారు.