నర్సంపేట, ఏప్రిల్ 23 : ఉత్తర యుద్ధం అద్భుతమైన కార్యక్రమమని, నర్సంపేటలో దీన్ని చేపట్టడం అభినందనయమని, దాన్ని రాష్ట్రమంతటా కొనసాగిద్దామని, శభాష్ అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. టెలీకాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో ఆదివారం సాయంత్రం కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 25న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జరిగే ప్లీనరీ సమావేశాల్లో ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇటీవల ప్రారంభించిన ఉత్తర యుద్ధం కార్యక్రమం రోజురోజుకూ ప్రశంసలు అందుకుంటున్నది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు తమ మద్దతును తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాశారు. దీనిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని అభినందించారు. ఉత్తర యుద్ధం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నర్సంపేటలో చేయడం అభినందనీయమని కితాబునిచ్చారు. ఉత్తర యుద్ధాన్ని రాష్ట్రమంతటా కొనసాగించాలని సూచించారు. ఈ ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 119 నియోజకవర్గాల స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని ఎమ్మెల్యేలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఉత్తర యుద్ధానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని మంత్రి కేటీఆర్ కోరారు.