కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము ఓటమి పాలైనా ఏడాది కాలంలో జరిగే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. మంగళవారం జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో భారీ సంఖ్యలో హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ మళ్లా తిరిగి ఇటు చూడలేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, అతడికి అండగా ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి మాత్రమే జనంలో ఉన్నారని, ప్రభుత్వం పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, అందులో ఏవైనా చేశాడా? అని ప్రశ్నించారు. అక్కడో ఇంజన్, ఇక్కడో ఇంజన్.. డబుల్ ఇంజన్తో హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈటల గడిచిన 14 నెలల్లో దమ్మిడిపైసానైనా తెచ్చి అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. షుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లు రూ. 3వేల పింఛన్ ఇప్పిస్తామని చెప్పిన ఈటల రాజేందర్ మాటలు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. ఈ బహిరంగ సభను చూసిన తర్వాత హుజూరాబాద్ గడ్డ మీద మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ మళ్లీ సానుభూతి వచనాలతో జనం ముందుకు వస్తారని, ఆయన మాటలు నమ్మితే మోసపోతారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చంపుకున్నా మీరే.. సాదుకున్న మీరే అంటూ చిలుక పలుకులు పలుకుతాడని, ఆయన మాటలు వింటే గందరగోళం, ఆగమాగం అవుతారని సూచించారు.
జమ్మికుంట సభతో బీజేపోళ్ల కండ్లు, పెయ్యి తిరిగేలా ఉంది. నేను నలభై ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఎందరో ముఖ్యమంత్రులను చూసిన. అందరిలో దమ్మున్న నాయకుడంటే కేసీఆర్ ఒక్కరే. బీజేపీ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నరు. వాళ్లను మనం పట్టించుకోవద్దు. రాజకీయ జీవితాన్నిచ్చి, మంత్రిగా అవకాశం ఇచ్చిన పెద్ద మనిషిని మోసం జేసేటోన్ని మాత్రం వదిలి పెట్టకున్రి. నాటి ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కోసం కొట్లాడినం. కెనాల్లో నీళ్లు లేవు. ఎస్సారెస్పీలో నీళ్లు లేవు. కరెంటు రాకపోయేది. మోటర్లు, మీటర్లు కాలిపోయేవి. 60 ఏండ్లలో ఏం సాధించలే. కానీ, తెలంగాణ వచ్చినంక పరిస్థితులు మారినయ్. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. నీళ్లు కాళ్లకాడికి వచ్చినయ్. బీడు భూములన్నీ పచ్చగా మారినయ్. బీజేపీ పాలనలో ధరలు పెరిగినయ్. సామాన్యుడు బతుకుడు కష్టమైతంది. గెలిచిన బండి సంజయ్, ఈటల ఏం పగుల గొడ్తున్నరు? ఒక్క పైసా తేలే. అభివృద్ధి దిక్కు చూడలే. ఎందుకీ బీజేపీ? తరిమి తరిమి కొట్టాలే.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు