హనుమకొండ చౌరస్తా, మే 5 : జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంటుందని చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో మంత్రి నాలుగు కొత్త ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూణె ముంబై అయింది, మైసూర్ ఐసిటీ ఫర్ బెంగళూరు అయిందని, వరంగల్ కూడా గొప్పగా ఎదగనుందన్నారు. ఇప్పటికే ఇక్కడ టెక్ మహీంద్ర, సైయంట్, సాఫ్ట్పాత్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. కిట్స్ కళాశాలలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించినట్లు చెప్పారు. వరంగల్ ఎన్ఐటీ, ఎస్సార్లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని, హైదరాబాద్, బెంగళూరులో ఉండే వాళ్లకు కాదు చిన్న పట్టణాల యువతకు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. వరంగల్ జెన్ప్యాక్ట్ కంపెనీలో 400 మంది ఉండగా, మరో వెయ్యిమందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధి సతీశ్ వడ్లమాని, విద్యా శ్రీనివాస్ చెప్పారని మంత్రి వివరించారు. ఎల్టీఐ మైండ్ ట్రీలో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఉండగా, మరో 200 నుంచి 500 మందిని తీసుకోనున్నట్లు కంపెనీ ప్రతినిధి గొల్లపూడి కృష్ణ , హెచ్ఆర్హెచ్ నెక్స్లో ప్రస్తుతం 120మంది ఉండగా, ఉద్యోగుల సంఖ్యను 500 వరకు పెంచనున్నట్లు ప్రతినిధి అంకిత్షా చెప్పారని మంత్రి పేర్కొన్నారు. అలాగే హెక్సాడ్లో 65 మంది ఉండగా, కంపెనీ ప్రతినిధి రాజేశ్ మరో 300 మందిని తీసుకుంటామని చెప్పారని, ఈ లెక్కన వరంగల్లో కొత్తగా 2 వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు యవతకు రానున్నట్లు తెలిపారు. అనంతరం కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ శాలువాలతో సన్మానించారు.
మోడల్ వైకుంఠధామం ప్రారంభం..
నయీంనగర్ : గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ వాజ్పేయి కాలనీలో రూ.4.50 కోట్లతో ఏర్పాటు చేసిన మోడల్ పంచభూత వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇళ్ల పట్టాల అందజేత..
ఇందిరానగర్, సాయినగర్వాసులకు మంత్రి కేటీఆర్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు జీవో 58 కింద ఇళ్ల పట్టాలను అందించారు. పట్టాలు అందుకున్న వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, బీఆర్ఎస్ నాయకుడు సిరబోయిన కరుణాకర్, టీజీవో కో ర్డినేటర్ జగన్మోహన్రావు, కార్యదర్శి ప్రవీణ్, టీఎన్జీవోస్ నేత కోలా రాజేశ్కుమార్గౌడ్ పాల్గొన్నారు.
సైన్స్ పార్కు ప్రారంభం..
హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో రూ.70 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పార్కును పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. కొత్తగా ఆలోచించి పరికరాలను కనిపెట్టాలని, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు.
సెల్ఫీల జోష్..
వైకుంఠధామాన్ని ప్రారంభించేందుకు హాజరైన మంత్రి కేటీఆర్తో పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ప్రజల అభిమానం చూసిన ఆయన వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మేయర్ గుండు సుధారాణీ, కార్పొరేటర్ నల్లా స్వరూపారాణి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య పాల్గొన్నారు.