భీమదేవరపల్లి, జనవరి 10 : కొత్తకొండ వీరభద్రస్వామి కల్యాణం బుధవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే బ్రహ్మోత్సవాలు కల్యాణంతో ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించి వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొని వచ్చి కల్యాణమండపంలో అందంగా అలంకరించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీసమేతంగా హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ మహ్మద్ బారి, కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సాయిబాబు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ రాజమణి, ఈవో కిషన్రావు, ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, ముఖ్య అర్చకులు రాంబాబు, శ్రీకాంత్, వినయ్, రమేశ్, శ్రావణ్, ఆలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గుప్తా, పిడిశెట్టి కనుకయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.