భీమదేవరపల్లి, జనవరి4: కొత్తకొండ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఎల్ నాగరాజుతో కలిసి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొత్తకొండ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో 605 మంది పోలీసు సిబ్బంది అవసరమని భావిస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ బారి పేర్కొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసులు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. ఏటా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రహదారికి ఇరువైపులా సైడ్ బర్మింగ్, గుంతలను పూడ్చడం, ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జాతరలో పారిశుధ్య నిర్వహణపై డీపీవో జగదీశ్వర్ను ప్రశ్నించారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల నుంచి ప్రత్యేకంగా శానిటేషన్ సిబ్బంది వచ్చి విధులు నిర్వర్తిస్తారని, చెత్తను సేకరించి ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తారని ఆయన సమాధానమిచ్చారు.
జాతరలో విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. మేడారం జాతర దృష్ట్యా కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు ఐదు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, సిద్దిపేట, హనుమకొండ, హుజూరాబాద్, హుస్నాబాద్ నుంచి నిరంతరాయంగా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. అవసరమైన చోట బారికేడ్లు, అడుగడుగునా నిఘా నేత్రాలు, రూట్ మ్యాప్ జాతరలో తప్పనిసరిగా ఉండాలన్నారు. గుడుంబా, జూదం, మట్కా, ఈవ్టీజింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తుల తాకిడిని తగ్గించేందుకు వీఐపీలకు సైతం టికెట్లు తీసుకోవాలని ఈవో కిషన్రావుకు సూచించారు. అనంతరం జాతర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మ హేందర్జీ, ఆర్డీవో రమేశ్, దేవాదాయ శాఖ ఏసీ రామాల సునీత, కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో భాస్కర్, సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీ రాజమణి, ఉపసర్పంచ్ కృష్ణ, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్, ముల్కనూరు, వంగర, ఎల్కతుర్తి ఎస్సైలు సాయిబాబు, వెంకటేశ్వర్లు, రాజుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.