నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7 ; అదునుకు ఆత్మబంధువులా ‘రైతుబంధు’ ఇస్తుండడంతో రైతాంగం ఉత్సాహంగా ముందుకు ‘సాగు’తోంది. నాడు కరంటు, నీళ్లు లేక అరిగోస పడ్డ అన్నదాతకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయంతో పాటు అన్నీ ఇచ్చి ఆసరా అవుతుండడంతో పడావు పెట్టిన భూముల్లోనూ పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను కూలీలకు, ఎరువులు, పురుగుమందులకు ఖర్చు చేస్తున్నారు. గత నెల 28 నుంచి ఎకరాల వారీగా లబ్ధిదారులకు నగదు అందిస్తుండగా వాటిని అందుకుంటున్న రైతులు.. ‘రైతుబంధు’ పథకం లేకపోతే చాలా కష్టమయ్యేదని చెబుతున్నారు. రైతుల కోసం ముందుచూపుతో ఆలోచించే ముఖ్యమంత్రి ఉండడం వల్లే ఈ రోజు వ్యవసాయం పండుగైందని.. ఇదే ఉత్సాహంగా బంగారు పంటలు పండిస్తామని పేర్కొన్నారు.
‘రైతుబంధు’ వచ్చినంక జిరాక్స్ బంద్ వెట్టిన..
రేగొండ : నాకు ఎకరం భూమి ఉంది. నాడు నీళ్లు, కరెంట్ సౌలత్ లేక బ్యాంకు లోను తీసుకొని జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న. దరఖాస్తు ఫారాలు అమ్ముకుంట బతికిన. అయితే కరంట్ సక్కగ ఉండక దుకాణం నడవక చాలా ఇబ్బందిపడ్డ. గిట్లయితే కుటుంబాన్ని సాదుదెట్ల అని రంది పెట్టుకున్న. గిరాకీ వచ్చినకాడికి నడిపిచ్చిన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏడాదంత కాల్వల్ల పుష్కలంగా నీళ్లు, అదునుకు పెట్టుబడి కోసం కేసీఆర్ సారు రెండు సార్లు ‘రైతుబంధు’ మొదలువెట్టినంక కొండంత ధైర్యం వచ్చింది. సాగు పనులకు ఇబ్బంది లేకుంట అన్నీ ఇత్తాండని తెలిసి సంబురపడ్డ. ఇంతల్నే నాకు కూడా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డయ్. ఇగ అప్పటిసంది జిరాక్స్ షాపు బంద్ పెట్టిన. నాకున్న ఎకరం, ఇంకో రెండెకరాలు కౌలు తీసున్నా. ఇప్పుడు రెండు పంటలు సాగు చేస్తున్న. కూరగాయలు కూడా పండిత్తాన. ఇప్పుడు నా ఆదాయం కూడా పెరిగింది. ఇదంతా కేసీఆర్ సారు పుణ్యమే. నీళ్లు, కరంటు, పెట్టుబడికి పైసల్లేక ఆగమైన నా అసొంటోళ్లు నిజంగా ఆయన రైతుబంధువే. ఆయన చేసిన సాయం ఎప్పటికీ మరువ.
– మండగాని రాంచందర్, రేగొండ
వడ్డీ బాధల్లేకుంట జేశిండు..
రేగొండ : రైతుబంధు పైసలు ఇచ్చుడు మొదలైనంక వడ్డీ వ్యాపారులకు దగ్గరికి పోవుడు బందైంది. బ్యాంకు అకౌంట్ల పడ్డయని మెస్సేజ్ రాంగనే పోయి ఇడిపిచ్చుకుంటాన. సక్కగ ఇత్తనాల దుకాణానికి పోయి అవసరమున్న కాడికి ఎరువులు, పురుగు మందులు కొంటున్న. అదునుకు పెట్టుబడి సాయం ఇయ్యవట్టే ఇవన్నీ తెచ్చుకుంటాన. పైసల కోసం వడ్డీ వ్యాపారులు, దళారుల దగ్గరికి పోయే పని లేకుంట జేశినందుకు కేసీఆర్ సారుకు దండాలు. రైతుబంధు వచ్చినకాన్నుంచి రంది లేకుంట ఎవుసం చేసుకుంటాన. గిసొంటి ముఖ్యమంత్రి ఉన్నంత మాకేం బాధ.
– మైస బాలయ్య, రేగొండ
‘రైతుబంధు’తో రైతేరాజు సాకారం..
దేవరుప్పుల : పడావు పడ్డ ఎగుసానికి వెన్నెముక రైతుబంధు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు, కరెంటు లేక, విత్తనాలు, ఎరువులు దొరకక ఎవుసం సాగక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ‘రైతే రాజు’ నినాదం సాకారమైంది. సాగునీరు, 24గంటల కరెంటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలకు తోడు రైతుబంధుతో రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న వాగుపై తొమ్మిది చెక్డ్యాములతో భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయి. రైతులు తెలెత్తుకుని బతుకేలా చేశాయి. రైతంటే పిల్లనివ్వని రోజులు పోయి, రైతు కుటుంబాలకు ఆడపిల్లల తండ్రులు ప్రాధాన్యాతనిచ్చే రోజులు వచ్చాయి. మాది దళిత కుటుంబం, రెండెకరాలు వారసత్వ భూమి ఉంది. సాగునీరు, కరెంటు, రైతుబంధుతో నా వ్యవసాయం సాగుమీదికి వచ్చింది. ప్రభుత్వం నాకు సబ్సిడీపై ట్రాక్టర్ ఇచ్చింది. వ్యవసాయంతో పాటు ఉపాధి దొరికింది. రైతుబంధు డబ్బులు రూ.10 వేలు మూడు రోజలు క్రితం పడితే నేడు నాటు వేస్తున్నం. – చింత రవి, రైతు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, దేవరుప్పుల
‘రైతుబంధు’ లేకుంటే మస్తు కష్టమయ్యేది..
పరకాల : రైతులకు కోసం తెలంగాణల ఉన్నన్ని పథకాలు దేశంలనే లేవు. రైతులు బాగుండాలని.. పంటలు మంచిగ పండాలని సీఎం కేసీఆర్ సార్ ఎంతో సాయంజేత్తున్నడు. రాష్ట్రమంత 24గంటలు ఫ్రీ కరంటు, ప్రతి ఎకరాకు సాగునీళ్లు ఇచ్చుకుంటనే పెట్టుబడికి కష్టం కాకుంట ‘రైతుబంధు’తోటి అదునుకు ఆసరా అయితాండు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ రైతులకు పెద్దన్న లెక్క చూసుకుంటాండు. ‘రైతుబంధు’ పెట్టకముందు పెట్టుబడికి చాలా కష్టమయ్యేది.ఇప్పుడు రెండు సీజన్లకు పెట్టుబడి బాధలు తప్పించిండు. ఇప్పుడు అదునుకు పంటలను సాగు చేసుకుంటానం. గిట్టుబాటు కూడా మంచిగైతాంది.
– నీరటి సుధాకర్, రాజీపేట, పరకాల
పెట్టుబడికి అక్కెరకు వస్తున్నయ్
మాకు రెండెకరాల దాక వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వరి, పత్తి, మక్క పండిస్తున్నం. ప్రతి యేడు పంటలు వేసే సమయంలో దుక్కి దున్నడానికి, ఎరువులకు, విత్తనాలకు పెట్టుబడి కోసం చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు యాసంగి, వానకాలం సీజన్లలో పంటలు వేసే సమయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం బ్యాంకుల వేస్తుండు. ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నీళ్లు కూడా పుష్కలంగా వస్తున్నయ్. అన్నీ ఉండడం వల్ల సరైన సమయంలోనే పంటలు వేస్తున్నాం. పండిన పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నది. రైతులను అన్ని తీర్ల ఆదుకుంటున్న కేసీఆర్ సారును మరువం.
– కెక్కర్ల సుజాత-సదానందం, పెంచికల్పేట, ఎల్కతుర్తి మండలం
కూలీలకు పైసల్ ముట్టినయ్..
కేసముద్రం : రైతుబంధు నగదు ఎవుసం పనులకు అక్కెరకు వస్తున్నయ్. నాకున్న మూడెకరాల భూమికి పెట్టుబడి సహాయం కింద రూ.15వేలు పడ్డయ్. వచ్చిన దాంట్ల కొన్ని పైసలు కూలీలకు అయినయ్, మిగితా వాటితోని పురుగు మందులు తెచ్చిన. ఇదివరకు మిర్చి తెంపిన తర్వాత పైసల కోసం కూలీలు ఇంటి సుట్టు రోజుల కమాన తిరిగేటోళ్లు. చేతిల రూపాయి లేక ఆగమయ్యేది. అప్పుడు మార్కెట్ల ధర ఉన్నా.. లేకున్నా మిర్చి అమ్మి కూలీలకు ఇచ్చేది. గిప్పుడు కేసీఆర్ పుణ్యమా అని ఆ అవసరం లేకుంట లేకుంటైంది. ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇయ్యకపోతే మస్తు కట్టమయ్యేది. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పుడే మిర్చి అమ్ముత. సీఎం కేసీఆర్ రైతులకు 24గంటలు ఫుల్ కరెంట్, నీళ్లు ఇచ్చి పెట్టుబడికి కూడా ఆదుకునేడు సంతోషంగా ఉంది
– అంబిట భిక్షం, కొత్తూర్, కేసముద్రం