హనుమకొండ చౌరస్తా, జనవరి 5 : కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ సంగసారపు కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కేయూలో 2021-22, 23 సంవత్సరానికి హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ పెండెం రాజేందర్ టెండర్ దక్కించుకున్నాడు. మే, ఏప్రిల్కు సంబంధించిన రూ.9 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇచ్చేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య రాజేందర్ను లంచం డిమాండ్ చేశాడు. రాజేందర్ సమాచారంతో కిష్టయ్యను ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా పాల కాంట్రాక్టర్ నుంచి యూపీఐ ద్వారా రూ.50 వేలు లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్నవారిపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఒక్క హాస్టల్లోనే కాకుండా కిష్టయ్యపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ఒకడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కిష్టయ్య భార్య ఆర్ట్స్ కాలేజీలో పార్ట్టైం సోషియాలజీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం.
కేయూలో మూడేళ్లుగా నాలుగు హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తున్నా. గత సంవత్సరం ఏప్రిల్, మే బిల్లులు ఇవ్వకుండా అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య నిలిపివేశాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా పిలిపించి అడిగితే చెల్లిస్తానన్నాడు. మళ్లీ ఇప్పుడు బిల్లులు ఎందుకివ్వాలి.. మాకు కూడా ఖర్చులు ఉంటాయి. అందరూ ఇస్తున్నారు. నువ్వు కూడా రూ.50 వేలు ఇస్తేనే రూ.3 లక్షల బిల్లులు ఇస్తానడంతో ఏసీబీ అధికారులకు పట్టించా.