వరంగల్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోరుగడ్డ ఓరుగల్లుకు ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల మీదుగా రోడ్షో ద్వారా వరంగల్ నగరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి జనగామ, స్టేషన్ఘన్పూర్, మడికొండ, కాజీపేట, అదాలత్, పెట్రోల్ పంప్ జంక్షన్ల మీదుగా హనుమకొండ చౌరస్తాకు వస్తారు. అక్కడ బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రోడ్షో స్థలాలను శనివారం జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించగా, అధినేత రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కెప్టెన్ ఇంట్లో బస
రోడ్షో ముగిసిన తర్వాత హనుమకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో రాత్రి బస చేస్తారు. సోమవారం హంటర్రోడ్డు, వర్ధన్నపేట, తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మంలో రోడ్షోకు వెళ్తారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్లో రోడ్ షో నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వరంగల్కు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. గురువారం హసన్పర్తి, హుజూరాబాద్ మీదుగా జమ్మికుంటకు చేరుకుని రోడ్షోలో పాల్గొంటారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్ షో నిర్వహణ కోసం బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఆదివారం హనుమకొండలో జరిగే రోడ్ షో నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కేసీఆర్ రోడ్ షోకు వేలాదిగా తరలి రావాలి మాజీ మంత్రి దయాకర్రావు
వరంగల్లో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ రోడ్ షో పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తొర్రూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్, పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర నేత మెట్టు శ్రీనివాస్తో కలిసి ఎర్రబెల్లి కేక్కట్ చేసి మాట్లాడారు. జలదృశ్యం నుంచి జనదృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు, అణచివేతలు, అవమానాలు ఎదురైనా కేసీఆర్ ఎన్నడూ ఎత్తిన జెండాను దించలేదన్నారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవం దె బ్బతిన్నప్పుడల్లా కేసీఆర్ సాగించిన ఉద్యమంతో ధికార స్వరమై నిలిచిందని తెలిపారు. అభివృద్ధిలో ముందుకెళ్తున్న రాష్ర్టాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి, ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయించాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశం అబ్బురపడే రీతిలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ పోరాటం చేసిందని, ఇప్పుడు మరోసారి ప్రజా ఉద్యమం చేసేందుకు సిద్ధమైందన్నారు. మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, డాక్టర్ సోమేశ్వర్రావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్రెడ్డి, నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్, శామకూరి ఐలయ్య, కర్నె నాగరాజు, జంపా, రాయిశెట్టి వెంకన్న, లేగల వెంకటరెడ్డి, మాచర్ల వెంకన్న పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎర్రబెల్లి, దాస్యం
ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హనుమకొండలోని రోడ్షో స్థలాలను శనివారం సాయంత్రం బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. రోడ్ షో నిర్వహించే అంబేదర్ జంక్షన్, పెట్రోల్ పంప్, హనుమకొండ చౌరస్తా జంక్షన్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ క్షేత్రస్థాయిలో తిరిగి పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. వీరితో మాజీ ఎమ్మెల్యే సతీశ్బాబు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఉన్నారు.