న్యూశాయంపేట, మార్చి 14 : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు జీవో 58 ద్వారా మంజూరైన ఇళ్ల పట్టాలు, హనుమకొండ మండలానికి చెందిన ఆరుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 58 ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తోందని తెలిపారు. పేదలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు శాశ్వతంగా పట్టాలను అందజేసి, సొంత ఇంటి కలను నిజం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు జేసీబీలు, పొక్లెయిన్లతో గుడిసెలను కూలగొట్టే ప్రయత్నం చేయడంతో పేదలు భయాందోళన చెందారని తెలిపారు. వారికి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.