బయ్యారం, జనవరి 11 : రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని గంథంపల్లి, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి కంటి వెలుగు ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజల కంటి సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రిక లు అందించాలన్నారు. పరీక్షల అనంతరం రీడింగ్ గ్లాసులు వెంటనే ఇవ్వాలని, దూరపుచూపు సమస్య ఉన్న వారికి ఆర్డర్ ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సబ్యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, వైద్యాధికారులు సాగర్, విజయ్ పాల్గొన్నారు.