రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 2,397 మందికి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. కండ్లద్దాలను పొందుతున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తమ జీవితాలకు వెలుగు ఇచ్చిందని మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శుక్రవారం కంటివెలుగు సెంటర్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కే వెంకటరమణ సందర్శించి వైద్యులు, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు.
వరంగల్, జనవరి 20 (నమస్తేతెలంగాణ) : రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమాన్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. గురువారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం ద్వారా నేత్ర శిబిరాలు నిర్వహిస్తు న్నది. జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకంగా 44 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృం దంలో తొమ్మిది నుంచి పది మంది ఉన్నారు. మొత్తం 44 బృందాల్లో మెడికల్ ఆఫీసర్లు 44, ఆప్తాలమిస్ట్లు 44, సూపర్వైజర్లు 50, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 44, ఏఎన్ఎంలు 255, ఆశ కార్యకర్తలు 656 మంది విధు లు నిర్వర్తిస్తున్నారు. కంటివెలుగు నిర్వహణపై వీరికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. పీహెచ్సీ, యూపీహెచ్సీ వారీగా కంటి శిబిరాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేశారు. 100 రోజుల్లో 44 టీంలు 408 శిబిరాలు నిర్వహించడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని నిర్ణయించారు. ప్రత్యేక బృందాలకు ఏఆర్ మిషన్లు, టార్చ్లు, ట్యాబ్లు, కళ్లద్దాలు, మందులు, ఇతర సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేసిం ది. రవాణా కోసం ప్రతి బృందానికి ఒక వాహనం సమకూర్చింది. వైద్య అధికారులు, సిబ్బందికి భోజనంతో పాటు టెంటు, కుర్చీలు, తాగునీరు, విద్యుత్ తదితర ఖర్చుల కోసం నిధులు కేటాయించింది. ఆయా పీహెచ్సీ, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు 44 బృందాలకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. రెండోవిడుత విజయవంతం కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ నేతృత్వంలో పది మంది వైద్య అధికారులతో జిల్లా స్థాయిలో ఒక సెల్ పనిచేస్తున్నది.
నేత్ర శిబిరాల్లో…
షెడ్యూల్ ప్రకారం రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా గురువారం 44 నేత్ర శిబిరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కంటివెలుగు శిబిరాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిరోజు 44 శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది 4,751 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో పురుషులు 2,026, మహిళలు 2,725 మంది ఉన్నారు. 926 మందికి వైద్యులు, సిబ్బంది కంటి అద్దాలను అందజేశారు. 2,629 మందికి ఎలాంటి దృష్టి లోపం లేదని వెల్లడించారు. రెండోరోజు శుక్రవారం 44 నేత్ర శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది 6,282 మందికి కంటి పరీక్షలు జరిపారు. వీరిలో 2,397 మందికి కళ్లద్దాలను అందజేశారు. రెండురోజుల్లో కంటివెలుగు కార్యక్రమం ద్వారా 44 నేత్ర శిబిరాల్లో మొత్తం 11,033 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 3,323 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు తెలిపారు.
కంటి పరీక్షలు పొందిన 11,033 మందిలో పురుషులు 4,676, మహిళలు 6,008 మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. కళ్లద్దాలను పొందిన 3,323 మందిలో నలభై ఏళ్లలోపు వారు 272, నలభై ఏళ్లకుపైగా వయసు గల వారు 2,861 మంది ఉన్నట్లు వెల్లడించారు. 2,262 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను అందజేయాల్సి ఉందని తెలిపారు. నేత్ర శిబిరాల్లో రెండురోజులు కంటి పరీక్షలు పొందిన వారిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. డీఎంహెచ్వో కె వెంకటరమణ నెక్కొండ మండలంలోని దీక్షకుంట, ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, చెన్నారావుపేట మండల కేంద్రంలోని కంటి శిబిరాలను సందర్శించారు. కంటి పరీక్షల నిర్వహణ, మందులు, కళ్లద్దాల పంపిణీపై శిబిరాల్లో వైద్యులు, సిబ్బందికి ఆయన సూచనలు చేశారు.
నిరుపేదలకు ఎంతో మేలు..
నల్లబెల్లి, జనవరి 20 : కండ్లు మసకబారి పోయిన మా లాంటి నిరుపేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు కంటివెలుగు కార్యక్రమం చాలా ఉపయోగపడుతున్నది. ప్రైవేట్ దవాఖానలో మాదిరిగానే ఆధునిక యంత్రాలతో ఉచితంగా పరీక్షలు చేసి వెంటనే కళ్లద్దాలను అందించారు. బలానికి మందులు ఇచ్చారు. పేదోళ్లకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– పిట్టల సుజాత, నల్లబెల్లి