సంగెం, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని పేదలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగెం మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు గడపగడపకు అందుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ పథకాలను అందజేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు అత్యవసర సమయంలో అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందితే సీఎం రిలీఫ్ పండ్ అండగా నిలుస్తున్నదని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి చేకూరిందని, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.