వరంగల్, ఏప్రిల్ 23: భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారికి పర్వతరాజకుమారి మహేశ్వరి అలంకరణలో ఉదయం వృషభ వాహనంపై, సాయంత్రం మృగవాహనంపై మాడవీధుల గుండా ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారికి మకర వాహన సేవ, సాయంకాలం చంద్రప్రభ వాహన సేవల అనంతరం ఎదురుకోలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కల్యాణం జరిగే దేవతా విగ్రహాల కోసం భూదాన్ పోచంపల్లి నుంచి చేనేత కళాకారులు తెచ్చిన పట్టువస్ర్తాలను ఈఓ శేషుభారతికి అప్పగించారు. మంగళవారం సాయంత్రం జరిగే కల్యాణ క్రతువులో పాల్గొనాలనుకునే భక్తులు ప్రత్యేక కౌంటర్లో రూ.516 చెల్లించి రసీదు పొందాలని తెలిపారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్ర్తాలు, ప్రసాదం అందిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.