వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక వరంగల్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక, కళా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంతో ఎన్నో రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలో ‘కాళోజీ కళా క్షేత్రం’ నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి స్వయంగా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి కంటే విశాలమైన భవన నిర్మాణం పూర్తవుతున్నది. హనుమకొండ బస్టాండ్ సమీపంలో విభిన్న శైలిలో ‘కాళోజీ కళా క్షేత్రం’ నిర్మాణమవుతున్నది. మున్సిపల్ మంత్రి కే తారకరామారావు మే 7న వరంగల్ నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా కాళోజీ కళా క్షేత్రం నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్షించారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా), పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత నుంచి ఈ నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. జనవరి లోపు పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక, కళా వైభవాన్ని కాపాడుకునేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. మొదట ఎకరంలోనే రూ.15 కోట్లతో నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆ మేరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వరంగల్కు ఉన్న సాంస్కృతిక, సాహిత్య రంగాల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఆ తర్వాత భవనం నిర్మాణంలో మార్పులు చేశారు. 4.25 ఎకరాల్లో నాలుగు అంతస్తులతో కాళోజీ కళా క్షేత్రం నిర్మించాలని నిర్ణయించారు. చూడగానే సాంస్కృతిక కేంద్రం అనిపించేలా కొత్త రకంగా ఈ భవనం డిజైన్ ఉన్నది. భవనం విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో నిధులను రూ.50 కోట్లకు పెంచారు. కుడా నుంచి రూ.25 కోట్లను విడుదల చేశారు. అనంతరం భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్లపాటు పనులు నెమ్మదించాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ సమీక్షతో పనులు వేగవంతమయ్యాయి. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం, మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు.