కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మండలంలో ఎర్జర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి ఆమె పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపక్ష పార్టీలకు కాలం చెల్లిందన్నారు. రూ.80వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షన్నర కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మాట్లాడడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శమన్నారు. వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ చాలంటూ చులకన చేసి మాట్లాడడం దర్మార్గమని, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమకుమార్రెడ్డి రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో రైతులపై కాంగ్రెస్ వైఖరి స్పష్టమైందన్నారు. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని వారికి అర్థమై ఇష్టారాజ్యంగా మాట్లాడతున్నారని అన్నారు. అందరం సమన్వయంతో పనిచేసి రెడ్యానాయక్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
మరిపెడ, నవంబర్ 3 : తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఉన్నతమైన విజన్తో పని చేస్తున్నారని, పార్టీ శ్రేణులమంతా సమన్వయంతో పనిచేసి బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని గిరిజన, స్త్రీశిశు సంక్షేమల శాఖ మంత్రి సత్యవతిరాథోద్ స్పష్టం చేశారు. శుక్రవారం మరిపెడ మండలంలోని ఎర్జర్ల గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామీణ మారుమూల గిరిజన తండాకు చెందిన ఆడబిడ్డగా తనను సీఎం కేసీఆర్ గుర్తించి ఎమ్మెల్సీ, ఆపై రాష్ట్ర కేబినేట్ మంత్రిగా ఉన్నత పదవులిచ్చారని తెలిపారు. తనకు అత్యున్నతమైన రాజకీయ జీవితం కల్పించిన కేసీఆర్కు జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే పార్టీకి శిరోధార్యమన్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అందరం కలిసి పనిచేసి డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి రెడ్యానాయక్ భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీలకు కాలం చెల్లిందన్నారు. డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయన్నారు. రూ.80వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షన్నర కోట్ల అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పేర్కొనటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను పల్లెల్లోకి వెళ్లి చూడాలన్నారు.
వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు అమలు చేస్తుండగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ చాలంటూ చులకన చేసి మాట్లాడడం దర్మార్గమని, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమకుమార్రెడ్డి రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో రైతులపై కాంగ్రెస్ వైఖరి స్పష్టమైందన్నారు. ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు ఖేల్ ఖతమన్నారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ వనరులను గుంటనక్కల్లా దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి సీఎం కేసీఆర్ చేసిన ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దోపిడీ దొంగల పాలు చేయొద్దన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళలు తాగునీళ్ల కోసం మైళ్ల దూరం నడిచివెళ్లేవారని, రైతులు సాగునీళ్లు, కరెంట్ కోసం అరిగోస పడ్డారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ కరెంటు 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు వేలకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి చివరి ఆయకట్టునూ పారిస్తూ, తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు.
24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. సుభిక్షమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో వందకు పైగా శాసనసభ స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి డోర్నకల్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించినట్లు తెలిపారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, పార్టీ శ్రేణులు మరోనెల రోజులు కష్టపడి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలన కంటికి రెప్పల కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు విద్వేషాలు లేవని, సమష్టి కృషితో బీఆర్ఎస్ను బలోపేతం చేద్దామన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి సీఎం కేసీఆర్తో సాధ్యమన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఇంటింటికీ సన్నబియ్యం, రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు దశలవారీగా రూ.16వేలకు పెంపు, రైతుబీమా తరహాలో సీఎం కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, కురవి జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్రెడ్డి , కొమ్మినేని రవీందర్, కొంపెల్లి శ్రీధర్రెడ్డి, కొంపెల్లి వేణుగోపాల్రెడ్డి, చిల్ల సహదేవ్ పాల్గొన్నారు.