హనుమకొండ, ఏప్రిల్ 18: సమాజంలో వ్యక్తులు, కుటుంబాల మధ్య వచ్చే గొడవలను శాంతియుతంగా పరిష్కరించి, శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం హనుమకొండలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా, ఒక వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తి సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు.
అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు.
ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, సి.హెచ్. రమేష్ బాబు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమా దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.