వరంగల్, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మైలార్ దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం.. కోర మీసాల మల్లన్న ఖండేల్ రాయుడిగా దర్శనమిచ్చే ప్రదేశం.. 1100 ఏళ్లకు ముందునుంచే చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం.. అష్టోత్తర స్తంభాలు, కాకతీయుల కీర్తితోరణాలు స్వాగతం పలికే గ్రామం.. పుట్ట మన్నుతో పూజలందుకునే మల్లికార్జునస్వామి కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు. శివ భక్తులకు మహా పుణ్యక్షేత్రమైన ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడు ఆరో విక్రమాదిత్యుడి (క్రీ.శ 1076-1127) వద్ద మంత్రిగా పనిచేసిన అయ్యన్నదేవుడు కట్టించాడు. అందుకే ఆయన పేరిట అయ్యన్నప్రోలు, అయ్యనవోలు, ఐనవోలుగా ఈ ఊరికి పేరు స్థిరపడింది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయం చాళుక్యుల నిర్మాణ శైలిలో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనేందుకు గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉన్నది. ఇలాంటి నిర్మాణం, చాళుక్యుల కాలానికే చెందిన వరంగల్ భద్రకాళి ఆలయంలో కనిపిస్తుంది. ఐనవోలు ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయుల కీర్తితోరణాలున్నాయి. కాకతీయ రుద్ర దేవుడు వీటిని నిర్మించాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో ఇందులో దేవదాసీలు ప్రాతఃకాల నృత్యం చేసేవారు. ఆలయంలో నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్ర ధరించి పది అడుగుల ఎత్తుతో మల్లన్న విగ్రహం అతి భీకరంగా కనిపిస్తుంది. బలిజమేడలమ్మ, గొల్లకేతమ్మ సమేత మల్లికార్జునస్వామి విగ్రహం ముందుభాగంలో మూలవిరాట్టు అర్ధ పానవట్టంపై శ్వేతవర్ణ శివలింగం ఉంటుంది. విగ్రహ కుడి పాదం కింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులుంటాయి. ఈ స్వామివారిని మైలార్ దేవుడు, ఖండేల్రాయుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడి మల్లికార్జునుడి విగ్రహం మట్టితో చేసినదని చరిత్రకారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఇదే మొదటిదని తెలుస్తున్నది. పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐనవోలుతో పాటు కొమురవెల్లి, గొర్రెకుంట గట్టుమల్లన్న, కట్టుమల్లన్న, కురవి ఆలయాలు ఉన్నాయి.
నాడు పట్టణం.. నేడు గ్రామం
చారిత్రకంగా ఐనవోలుకు ఎంతో విశిష్టత ఉన్నది. 1100 ఏండ్ల క్రితం నుంచే ఈ ఊరు ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. రాష్ట్ర కూటుల తర్వాత చాళుక్యులు పరిపాలించారు. చాళుక్యు లకు కాకతీయులు సామంతులుగా ఉండి, కాలక్రమంలో స్వతంత్ర రాజులు అయ్యా రు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలించారు. రాష్ట్ర కూట రాజు రెండో కృష్ణుడు 850-914 సంవత్సరాల్లో పరిపాలించాడు. ఆ కాలంలోనే ఐనవోలు ప్రస్తావన ఉన్నది. కాకతీ యుల తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పద్మనాయకులు పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఓరుగల్లు నగరాన్ని పాలించిన పశ్చిమ చాళుక్యుల వద్ద అయ్యన్నదేవుడు మంత్రిగా ఉండేవాడు. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనాల్లో ఉంది. అయ్యన్న పేరుతోనే ఈ ఊరికి అయ్యన్నవోలు అనే పేరుండేది. వ్యవహారిక భాషలో ఇది ఐనవోలు(ఐలోని)గా మారింది. పశ్చిమ చాళుక్య రాజు ఇరవబెండగ సత్య శ్రీయని శాసనం ప్రకారం (1076-1127)లో పరిపాలించిన ఆరో విక్రమాదిత్యుడి హయాంలోనూ ఐనవోలు పట్టణం ఉన్నది. రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన సింగమనాయకుని కుమారుడు అనపోత 1369లో ఐనవోలు ఆలయ ప్రాంగణంలోని ఓ స్తంభంపై చెకించిన సంసృతాంధ్ర దాన శాసనంలో మల్లరి వృత్తాంతాన్ని వర్ణించారు. అర్జునున్ని కాపాడేందుకు శివుడు ఒక శబరుని వేషంలో వచ్చి, మల్ల అనే రాక్షసున్ని సంహరించాడు. అలా మల్లరి అనే పేరు తెచ్చుకున్నాడు. మల్లరి అనే పేరు కాలక్రమంలో మైలార్ అయింది. మల్లాసురుడనే రాక్షసున్ని చంపడంతో మల్లారి పేరు వచ్చింది. యాద వులు, బలిజలు తమ ఆడబిడ్డలను ఈ ఖండేల్ రాయుడికి దేవేరులుగా చేశారని ఓ కథ ఉన్నది. కర్నాటక ప్రాంతంలో పుట్టిన ఖండేల్రాయుడు కర్నాటక నుంచి మహారాష్ట్ర దాకా పాలించాడు. ఆయన ఇద్దరి భార్యల్లో బలిజ మేడలమ్మ కర్నాటక ప్రాంతవాసి కాగా రెండో భార్య గొల్లకేతమ్మ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. తమ ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నందున మల్లికార్జునస్వామిని తమ ఇలవేల్పుగా గొల్లకురుమలు బండారి (పసుపు)తో పూజిస్తారు. ఇక్కడ శ్వేతవర్ణంలో అర్ధపానవట్టంపై ఉండే శివలింగం ఎక్కడా లేదని చరిత్రకారులు విశ్లేషించారు. కాకతీయు ల కాలం నుంచి ఆలయ నిర్వహణను ఐనవోలులో స్థానిక మార్నేని వంశస్తులు, కురు మలు, శైవారాధకులు సంయుక్తంగా నిర్వహించేవారు. ఐనవోలు కీర్తి, మరింత విస్తరిం చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో అప్పటి వరకు హకుదారులుగా కొన సాగిన మార్నేని వంశీయులు 1968లో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
రుద్రదేవుడు నిర్మించిన తోరణాలు
ఐనవోలు ఆలయానికి తూర్పు, దక్షిణ దికుల్లో కాకతీయ కీర్తి తోరణాలున్నాయి. మూడో తోరణం నిర్మాణం అసంపూర్తిగా ఉంది. రెండు కీర్తితోరణాలను కాకతీయ చవ్రర్తి రుద్రదేవుడు నిర్మించాడు. ఓరుగల్లు కోట నిర్మాణానికి ముందే ఐనవోలులో తోరణాలను నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి తోరణాల కంటే ఓరుగల్లు కోటలోని తోరణాలు మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. ముందుగా చెక్కినవి కావడం వల్లే ఐనవోలు తోరణాలు కొంత గరుకుగా ఉంటాయి. కాకతీయ రుద్రదేవుడు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఐనవోలు ఆలయానికి తోరణాలను నిర్మించినట్లు చరిత్రకారులు వివరించారు. ‘వేయిస్తంభాల దేవాలయంలో నిద్రలో ఉన్న తన కొడుకు రుద్రదేవుడిని లేపేందుకు కాకతీయ ప్రోలరాజు తాకగా ఆ సమయంలో శత్రువులు దాడి చేస్తున్నారేమోనన్న భావనతో తన వద్ద ఉన్న కైజారును తీసి తండ్రిని పొడుస్తాడు. అనుకోకుండా జరిగిందే అయినా తండ్రి చావుకు కారణమయ్యాననే ఆత్మన్యూనతతో రుద్రదేవుడు ఐనవోలు ఆలయంలో శిలాతోరణాలను నిర్మించాడు’ అని యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య వివరించారు.