జయశంకర్ భూపాలపల్లి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి పదవికి వెంటనే అతడు రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వం పై, తెలంగాణ రైతుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం కేంద్ర మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యానాన్ని కొనుగోలు చేయాలన్నారు. లేదంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులుండవు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.