భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 14 : సకాలంలో రుణాలను అందజేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో బుధవారం బ్యాంకర్లు, అధికారులతో డీసీసీడీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సంవత్సరం రూ.973 కోట్ల పంట రుణ లక్ష్యానికి సెప్టెంబర్ చివరి నాటికి రూ.251.32 కోట్లు అందజేశామని, రూ.446.57 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.94.89 కోట్లు, డిసెంబర్ 5 నాటికి 2998 స్వశక్తి సంఘాలకు రూ.154.24 కోట్లు, మెప్మా కింద 74 స్వశక్తి సంఘాలకు రూ.4.04 కోట్లు అందించామని కలెక్టర్కు బ్యాంకర్లు, అధికారులు తెలిపారు. పంట రుణాల లక్ష్య సాధనలో వెనుకంజలో ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పంట రుణాలు పంపిణీ చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రుణాలను రెన్యువల్పై రైతులకు అవగాహన కల్పించాలని, రైతు బంధు, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని బ్యాంకు అధికారులు పంట రుణాల పేరుతో జమచేసుకోవడానికి వీలు లేదని పేర్కొన్నారు.
ధరణి ద్వారా భూ వివరాలను పరిశీలించి రుణాలను అందజేయాలని సూచించారు. రుణాల పంపిణీలో 58.95 శాతం పూర్తయిందని, వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న యూనిట్ల లబ్ధిదారులతో చర్చించి త్వరగా గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ అయిన వాటికి యూసీలు సమర్పించాలన్నారు. ఏటూరునాగారంలో గిరిజనుల అభివృద్ధికి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని, మార్చి నాటికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద లక్ష్యం ప్రకారం 75 యూనిట్లకు రూ.2.17 కోట్లు మంజూరు చేసి 600 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సూచించారు. రెండో సారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు అందించాలన్నారు. అనంతరం నాబార్డ్ జిల్లా 2023-24 వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్ఎంలు అలీముద్దీన్, శ్రీధర్రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, జీఎం ఇండస్త్రీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో స్క్రూటినీ పూర్తి చేస్తాం.
పకడ్బందీగా ఓటరు జాబితా తయారు చేయాలని ఈసీ రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో పాల్గొన్న కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో 5173 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సకాలంలో స్క్రూటినీ పూర్తి చేసి అర్హుల వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేస్తామని తెలిపారు. డీఆర్డీవో శ్రీనివాస్, భూపాలపల్లి తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.