భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులతో మాట్లాడారు. ఎంత కాలంగా కాస్తులో ఉన్నారు…? కుటుంబ ఆర్థిక పరిస్థితులు తదితర విషయాలను ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తులను పరిశీలించి అర్హులకు హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య సాగర్రెడ్డి, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి శ్రీనివాస్, ఎంపీడీఓ అనిల్, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిన్రెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నేతలు ముద్దమళ్ల భార్గవ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.