జయశంకర్ భూపాలపల్లి, జూలై 16 (నమస్తే తెలంగాణ): వరదలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ధైర్యం చెప్పారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లిలోని గిరిజన బాలికల గురుకులం, పలిమెల మండలకేంద్రంలోని పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి ఆమె పరామర్శించారు. అక్కడ వారికి అందుతున్న వైద్యం, భోజన సౌకర్యాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలిమెల మండలమంతా నీట మునగడంతో బాధితులను మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.
విద్యుత్ శాఖకు భారీగా నష్టం వాటిల్లిందని, సరఫరాను పునరుద్ధరించే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. వరదలతో జిల్లాలోని పలిమెల, మహాముత్తారం మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లతో పాటు జాతీయ రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పరిస్థితులు సద్దుమనిగే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. ఇళ్లు కూలిన వారికి, లేనివారికి సీఎం ఆదేశాల మేరకు రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయంతో ఇండ్లు నిర్మించేందుకు సహకరిస్తానని తెలిపారు. పలిమెల సబ్సెంటర్లోని వైద్య శిబిరాన్ని సందర్శించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆ రోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సత్యవతి ఆదేశించారు. పలువురికి మందుల కిట్లు పంపిణీ చేశారు. అనంతరం 650 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. అదనపు కలెక్టర్ దివాకర, జడ్పీ వైస్ చైర్పర్సన్ శోభా రఘుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్నాయక్, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డీపీఓ ఆశాలత, జిల్లా నాయకులు చల్లా నారాయణరెడ్డి, క్యాతరాజు సాంబమూర్తి, రమేశ్, విద్యాసాగర్రెడ్డి, రవీందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జనార్దన్ పాల్గొన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందానికి మంత్రి అభినందనలు
జిల్లాలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ భవేశ్మిశ్రా కలిసి వారి సేవలను కొనియాడారు.
అటవీ ప్రాంతంలో భారీ కాన్వాయ్తో..
జిల్లాలో అత్యంత దట్టమైన అటవీప్రాంతమైన, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పలిమెల మండలంలో మంత్రి పర్యటన సాగింది. ఎస్పీ సురేందర్రెడ్డి పర్యవేక్షణలో సుమారు 70 కిలోమీటర్లు దట్టమైన అడవిలో భారీ కాన్వాయ్తో పర్యటించారు.