ఏటూరునాగారం/వాజేడు/మంగపేట, జూలై 16 : గోదావరి వరద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భరోసానిచ్చారు. శనివారం వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్జీ పాటిల్తో కలిసి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముందుగా వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జి వద్ద ఆగి గోదావరి వరదను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ముంపునకు గురైన బీసీకాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. 30మందికి ముంపు లేని చోట ఇంటి స్థలాలు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ కృష్ణఆదిత్య, తహసీల్దార్ లక్ష్మణ్కు సూచించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఇబ్బందుల్లేకుండా చూసిన మండల అధికారులు, ఎస్సై తిరుపతిరావును మంత్రి అభినందించారు.
ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, రొయ్యూరు సమీపంలోని వరద ప్రాంతాలను సందర్శించారు. ఎస్సీకాలనీలో వరద ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న భవనంపైకి ఎక్కి వరదలో మునిగిన ఇండ్లను పరిశీలించారు. ముంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు వరదలో మునిగినట్లు కాలనీవాసులు వివరించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వరద నివారణ చర్యలపై మంత్రికి పలువురు సర్పంచ్లు వినతిపత్రాలు అందజేశారు. మంగపేట పుష్కరఘాట్, పొదుమూరు శివారులో కోతకు గురవుతున్న గోదావరి తీర ప్రాంత పంట పొలాలు, బీటీ రోడ్డును ఆయన పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మంగపేట సమీప గోదావరి తీరానికి రివిట్మెంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ముందుగా గోదావరి శాంతించాలని చీర, పసుపు, కుంకుమ, హారతి సమర్పించి పూజలు చేశారు. అంతకుముందు మంగపేట హైస్కూల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ముంపు బాధితులు మంత్రికి తమ సమస్యలు చెప్పుకొన్నారు. అనంతరం కమలాపురం గుడ్డేలుగులపల్లిలో ముంపునకు గురైన నివాసాలను పరిశీలించి, బాధితులనుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ ఇటీవలి భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాల్లో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేశారన్నారు. 200 మంది పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలు, భోజన వసతులు ఏర్పాటుచేయడం అభినందనీయమంటూ అధికారుల సేవలను ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాగునీటి సరఫరా విషయంలో పైపులైన్లు శుభ్రంగా ఉంచాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు వేడి చేసిన నీరు తాగాలని, ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయాలని సూచించారు. కొట్టుకుపోయిన రోడ్లు వాటి వివరాల వివరాలు సమర్పించాలని రోడ్లు భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ తరపున తక్షణమే రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కూడా చేపడుతామన్నారు. గోదావరి కట్ట సమీపాన ఉన్న ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన నివేదిక అందజేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో ఎస్సీ కాలనీ, ఓడ గూడెం ప్రజలకు ఇంటి స్థలాలకు పట్టాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
వర్షాలు తగ్గిన తర్వాత రూ.137 కోట్లతో గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నీట మునిగిన కాలనీ గృహాలను గుర్తించి వారికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. రొయ్యూరు గ్రామానికి జాతీయ రహదారి నుంచి రూ.3కోట్ల అంచనాతో పంచాయతీరాజ్ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. టెండరు కూడా పూర్తయిందన్నారు. పొదుమూరు గ్రామానికి గోదావరి కరకట్ట కూడా నిర్మిస్తామన్నారు. ఏటూరునాగారం ఎస్సీ కాలనీ, ఓడ వాడ వరద ముప్పు నివారణకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. భూమికి బదులుగా భూమి ఇస్తామని మంత్రి చెప్పారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీకి మాస్టర్ప్లాన్ రూపొందిస్తామన్నారు.
ఆయాచోట్ల వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, అదనపు కలెక్టర్ వైవీ. గణేశ్, డీఆర్ఓ కె.రమాదేవి, ఏఎస్సీలు సుధీర్ రామ్నాథ్ కేకన్, అశోక్కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ఈ విజయభాస్కర్రావు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జిల్లా కో అప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ విజయ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కాకులమర్రి లక్ష్మీ నర్సింహరావు, టీఆర్ఎస్ నాయకులు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, రాంనర్సయ్య, మహేశ్, డీఎల్పీవో దేవరాజు, మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ వై శ్రీనివాసులు, ఎంపీడీవో కర్నాటి శ్రీధర్, సీఐ కిరణ్, ఎస్సై తాహెర్బాబా, ఎంపీవో శ్రీనివాస్, టీడీ సురేశ్బాబు, ఏఈలు పాడి వాసుదేవరెడ్డి, యాకయ్య, పంచాయతీ కార్యదర్శులు మాలోత్ హీరునాయక్, సాధు మురళి, సహకార సంఘం చైర్మన్ తోట రమేశ్, వైస్ చైర్మన్ నరేందర్, డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మణ్రావు, నర్రా శ్రీధర్, రైతు బంధు జిల్లా సభ్యుడు శేషగిరిరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రాజుయాదవ్, మల్లూరు దేవస్థాన చైర్మన్ ముకుందం, మాజీ జడ్పీటీసీ వైకుంఠం, సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీహరి, మండల ప్రత్యేక అధికారి సర్ధార్సింగ్, ఎంపీడీవో విజయ, ములుగు, వాజేడు జడ్పీటీసీలు సకినాల భవాని, తల్లడి పుష్పలత, ఎంపీపీ శారద, నాగారం సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, ఆర్ఐ రాజు, టిఆర్ఎస్ నాయకులు ముడిగ తిరుపతియాదవ్, ఎల్లయ్య, నానబాబు , సాంబశివరావు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య, క్లోరినేషన్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వాజేడు మండలంలో పూసూరు బ్రిడ్జి నుంచి వయా గుమ్మడిదొడ్డి, వాజేడు గ్రామానికి ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.13 కోట్ల రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఏటూరునాగారంలో కోడి పుంజుల అంగడి స్థలాన్ని గోదావరి కట్టను ఆనుకొని ఉన్న ప్రజలకు కేటాయించాలని వరద బాధితులకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గోదావరి నదికి 29లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినట్లు తెలిపారు. 4వేల మందికి పునరావాసం కల్పించినట్లు తెలిపారు.