పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక
అవగాహన కల్పించేందుకు సమావేశాలు
ప్రతి సెంటర్ వద్ద నిబంధనలతో కూడిన ఫ్లెక్సీ
192 సెంటర్లలో మౌలిక వసతులు
వరంగల్ రూరల్, ఏప్రిల్ 25(నమస్తేతెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.జిల్లాలో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంపునకు అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత వానకాలం సీజన్లో 175 సెంటర్లు ఏర్పాటు చేశామని, అదనంగా మరో 17 కేంద్రాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. పరిశీలించిన ప్రభుత్వం 192 సెంటర్ల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అధికారులు వీటిని పీఏసీఎస్లు, ఓడీసీఎంఎస్, ఐకేపీ, ఏఎంసీలు, ఎఫ్పీవో, జీసీసీకి కేటాయించారు. అత్యధికంగా పీఏసీఎస్లకు 100 కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఐకేపీకి 57, ఓడీసీఎంఎస్కు 23, ఏఎంసీలకు 6, ఎఫ్పీవోలకు 5, జీసీసీకి ఒకటి చొప్పున యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరికోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. గన్నీ సంచుల కోసం రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను, కూపన్ల కోసం ఏఈవోలను సంప్రదిస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తుండడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడంపైనే అన్నదాతలు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పీఏసీఎస్లు, ఓడీసీఎంఎస్, ఐకేపీ, ఏఎంసీలు, ఎఫ్పీవోలు, జీసీసీ ప్రతినిధులు పౌరసరఫరాల సంస్థ అధికారుల నుంచి గన్నీ సంచులను పొందుతున్నారు. అవసరాన్ని బట్టి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి యాసంగి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని ఇప్పటికే కలెక్టర్ ఎం హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు.
రికార్డుల నిర్వహణపై శిక్షణ
కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోలు, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్ల్లో ఎంట్రీ చేయడం, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్ కాంటాలు, ఇతర పరికరాలు, హమాలీలను సిద్ధం చేశారు. సెంటర్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ పద్ధతిన కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. నడికూడ మండలం నార్లాపూర్లో బుధవారం పీఏసీఎస్ అధికారులు జిల్లాలో తొలి యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గన్నీ సంచులు అందగానే ఇక్కడ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నడికూడ, పరకాల మండలాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక సమావేశాల ద్వారా అవగాహన
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దరిమిలా.. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తాజాగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, పీఏసీఎస్ల సీఈవోలు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు, ఐకేపీ, ఏఎంసీల, జీసీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, ఎఫ్పీవోల ప్రతినిధులు, సెంటర్లలో పని చేసే హమాలీలు ఇతరులను సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు సహా ప్రతి ఒకరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, గుంపులుగా ఉండొద్దని, కచ్చితంగా భౌతికదూరం పాటించాలని సమావేశాల్లో వారికి చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి సెంటర్ వద్ద చేతులను శుభ్రం చేసుకోవటానికి వాటర్, సబ్బు, శానిటైజర్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు తెలియజేసేలా కరపత్రాల ముద్రణతో పాటు ఫ్లెక్సీలను తయారు చేయిస్తున్నారు. అవగాహన కోసం గ్రామాల్లో ఈ కరపత్రాలను పంపిణీ చేయాలని, ఫ్లెక్సీలను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సెంటర్ల ఇన్చార్జిలను ఆదేశించారు. పీఏసీఎస్ల కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, సీఈవోలు, ఇతర ఉద్యోగులకు, సెంటర్ల నిర్వాహకులందరికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనల అమలుపై బుధ, గురువారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి ‘నమస్తేతెలంగాణ’కు చెప్పా రు. ఒకట్రొండు రోజుల్లో కొన్ని మండలాల్లో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు సెంటర్లలో మౌలిక వసతులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.