చిట్యాల: అటవీశాఖ భూములను సాగు చేస్తున్న రైతులు పోడు భూములపై హక్కుల పత్రాలను పొందడానికి దళారులను నమ్మి మోసపోవద్దని పోడుభూముల మండల స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. శుక్రవారం మండలంలోని వెంచరామి, అదే గ్రామశివారులోని కురుమపల్లిలో పోడుభూముల సమస్యలపై సర్పంచ్ కచ్చు మల్లేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి ఆర్ఓఆర్ఎఫ్(రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్-2006) చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ..గ్రామపంచాయతీ పరిధిలో రైతుల నుంచి మొత్తం 122 దరఖాస్తులను స్వీకరించి రశీదులు అందజేసినట్లు తెలిపారు.
పోడుభూముల సమస్యల పరిష్కారాని కోసం స్వీకరించిన దరఖాస్తుల వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన పెర్కొన్నారు. గ్రామ పరిధిలో ఉన్న వికలాంగులకు ఉపాధిహామీపనులకు జాబ్కార్డ్ అందజేసి పనులకు ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేయాలన్నారు. మండలంలోని అన్ని జీపీలలో వికలాంగులకు జాబ్కార్డులు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అలీంపాషా, పంచాయతీకార్యదర్శి ఇయాజ్, ఫారెస్ట్ బీట్ఆఫీసర్లు విజయ, కృష్ణ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.