భూపాలపల్లి : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూ సేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ జెన్కో సంస్థకు అవసరమైన భూమి, ఇప్పటి వరకు సేకరించిన భూమి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, జెన్కో అధికారులు సమన్వయంతో జెన్కోకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు.
పెండింగ్ లో ఉన్న దుబ్బపల్లి యాష్ డంపింగ్ స్థలం, కేటికే నుంచి చెల్పూర్ మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, తాడిచర్ల నుంచి జంగేడు మీదుగా జెన్కో వరకు కన్వేయర్ బెల్ట్, కొంపెల్లి, గుడాడ్పల్లి లో నూతనంగా భూ సేకరణ, కాపురం గ్రామంకు పునరావాసం తదితర పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం, నిర్వాసితులకు త్వరగా పురావాసం కల్పించి భూ సేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, జెన్కో సీఈ సిద్దయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, భూపాలపల్లి, గణపురం, మల్హర్రావు మండలాల తహసీల్దార్లు ఇక్బాల్, సతీష్కుమార్, శ్రీనివాస్, జెన్కో అధికారులు పాల్గొన్నారు.