జయశంకర్ భూపాలపల్లి : తల్లిదండ్రులను కొడుకులు చూసినా చూడకపోయినా సీఎం కేసీఆర్ వృద్ధులకు పెద్ద కొడుకుగా మారి పింఛన్లు అందిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.
గురువారం టేకుమట్ల మండలం దూబ్యాల, మందలోని పల్లి, అరెపల్లి, రాఘవరెడ్డి పేట, రామకృష్ణాపూర్ గ్రామాల్లో ఆసరా పెన్షన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు చెక్కులను పంపిణీ చేశారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అందిస్తూ..రైతు ఏ కారణం చేత మరణించినా రైతుబీమా అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు.
పేదింటి ప్రతి ఆడబిడ్డకు ఒక మేనమామలాగా మారి లక్షరూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి, తదితరులు పాల్గొన్నారు.