భూపాలపల్లి రూరల్ : నిర్ణీత సమయానికి కొవిడ్ రెండవ డోసు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్యశాఖ, మండల ప్రత్యేక అధికారులు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయడం మూలంగా జిల్లాలో 91 శాతం కొవిడ్ మొదటి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. మిగిలిన శాతాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సెకండ్ డోస్ వేసుకోవడం పై మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పోషకాహార లోపం ఉంటే చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు పెరగరని, జిల్లాలో భూపాలపల్లి, రేగొండ, మహాదేవ్పూర్, కాటారం, చిట్యాల తదితర మండలాల్లో తక్కువ బరువు గల శిశువుల వివరాలు నమోదయ్యాయని అన్నారు. తక్కువ బరువుతో ఉన్న చిన్నారుల వివరాలను సేకరించి వారికి అంగన్వాడీల ద్వారా అదనపు పౌష్టికాహారం అందించాలని సూచించారు.
రక్తహీనతతో బాధపడే గర్భిణులు, బాలింతలను గుర్తించి వారికి పౌష్టికాహారం, అవసరమైన మందులు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్, మండల ప్రత్యేక అధికారులు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.