విద్యార్థుల భవితకు విజ్ఞానజ్యోతి
‘వరంగల్ నవోదయ’కు వరుసగా రెండో ఏడాది దక్కిన అవకాశం
దేశవ్యాప్తంగా 50 విద్యాలయాల ఎంపిక
2020లో 12వ తరగతికి, ఈసారి 10, 11వ క్లాసు విద్యార్థులకు విద్యాభ్యాసం
బాలికలకు ఉపకార వేతనం, ఉచితంగా పుస్తకాలు
కరీమాబాద్, జూలై 30 : విద్యార్థుల ప్రతిభకు పట్టంకడుతూ వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయానికి గొప్ప అవకాశం లభించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగంలో బాలికల సంఖ్య పెంచేందుకుగాను కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘విజ్ఞానజ్యోతి’ కార్యక్రమంలో వరుసగా రెండో ఏడాది కూడా ఎంపికైంది. ఇందులో భాగంగా గతేడాది 12వ తరగతి విద్యార్థులు విద్యనభ్యసించగా, 2021కి గాను 10, 11 తరగతుల బాలికలు విద్యను అభ్యసించనున్నారు. గత రెండేళ్ల సీబీఎస్ఈ ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
దేశవ్యాప్తంగా గతేడాది 50 విద్యాలయాలకు అవకాశం రాగా, అందు లో మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. తాజాగా 2021లోనూ ఈ అవకాశం రావడంపై పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగంలో బాలికల సంఖ్యను పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. విజ్ఞానజ్యోతి ద్వారా విద్యార్థినులకు ఆయా విభాగాల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలు.. ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. విజ్ఞాన జ్యోతిలో అర్హత సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు రూ. 6 వేల విలువ గల పుస్తకాలు అందజేస్తారు.
ఉత్తమ శిక్షణకు గుర్తింపు..
నవోదయ విద్యాలయం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే లక్ష్యం. సిబ్బంది ఇస్తున్న ఉత్తమ బోధన, శిక్షణకు గుర్తింపుగా విజ్ఞానజ్యోతి రెండు దశల్లో అవకాశం లభించింది. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేస్తాం. ఎంపికైన వారికి స్కాలర్షిప్తో పాటు పుస్తకాలు అందజేస్తాం. విద్యాలయంలోని విద్యార్థులతోపాటు చుట్టపక్కల ఉన్న బాలికలకు సైతం పుస్తకాలు, యోగా మ్యాట్లను అందజేస్తున్నాం.