ఫ్రంట్లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్స్ గుర్తింపు
15 నుంచి 18 ఏళ్లలోపు వారు ఆరు శాతం
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ
వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 28: కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా పని చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే.. బూస్టర్ డోస్ను దేశవ్యాప్తంగా ఫ్రంట్లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్స్కు అందించేందుకు మార్గదర్శకాలు తయారు అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సన్నద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. అందుకు తగిన విధంగా కార్యాచరణ సైతం చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 3,505 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, 94,133 మంది 50 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారని గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గలవారు జిల్లావ్యాప్తంగా ఉన్న 7.50 లక్షల జనాభాలో 6 శాతంగా సుమారు 45 వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ టీకా వేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
118 కేంద్రాల ద్వారా టీకాలు
కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు డీఎంహెచ్వో వెల్లడించారు. అందుకు జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 118 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. కరోనా వారియర్స్గా గుర్తింపు కలిగిన విభాగాల వారీగా వివరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వాటి ఆధారంగా వ్యాక్సినేషన్ను కొనసాగిస్తామన్నారు. ఆధార్కార్డు లేదా ఏదేని ఫొటో గుర్తింపు ఆధారంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన వారి వివరాలు కొవిన్ పోర్టల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ దానిపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం గాని, ఆదేశాలు గాని అందలేదని డీఎంహెచ్వో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే వాటి ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.