మెరుగైన పారిశుధ్యం కోసం.. స్వచ్ఛ సాంకేతిక చాలెంజ్ పోటీలు
‘కొత్త వాగ్దానం’ పేరుతో ప్రతిపాదనల ఆహ్వానం
డంపింగ్ యార్డుల సమస్యను అధిగమించేందుకు
జీడబ్ల్యూఎంసీ అధికారుల ప్రణాళికలు
వరంగల్, డిసెంబర్ 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9 లక్షల జనాభా ఉంది. 407.771 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరంలో ప్రతిరోజూ 350 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. డంపింగ్ యార్డుల సమస్యను అధిగమించేందుకు జీరో డంపింగ్ లక్ష్యంగా మెరుగైన పారిశుధ్యానికి నిర్వహణకు ప్రజల నుంచి ప్రతిపాదనలను స్వీకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2035 సంవత్సరం నాటికి నగర విస్తరణతోపాటు జనాభా 13.07 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం అప్పుడు ప్రతి రోజూ 653 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. జనాభాతో పాటు పెరిగే చెత్త ఉత్పత్తి గ్రేటర్కు సమస్యగా మారకుండా ఉండేందుకు మెరుగైన పారిశుధ్యానికి సాంకేతికతను జోడించాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రతిరోజూ ఉత్పతి అయ్యే చెత్తను డంపింగ్ యార్డుల వరకు తరలించకుండా క్షేత్రస్థాయిలోనే రీ సైక్లింగ్ చేసేందుకు ప్రతిపాదనలను గ్రేటర్ ప్రజల నుంచి ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగానే స్వచ్ఛ సాంకేతిక చాలెంజ్ పోటీలకు శ్రీకారం చుట్టింది.
శానిటేషన్లో సాంకేతిక విప్లవం
నగర పారిశుధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వామ్యం చేసి సాంకేతిక విప్లవం తీసుకురావాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నారు. దీనికోసం వినూత్న ఆలోచనలతో ప్రతిపాదనలు పంపించాలని ప్రజలను కోరుతున్నారు. ఇంట్లోని చెత్త డంపింగ్ యార్డుకు చేరకుండానే క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్ చేసేలా సరికొత్త ఆలోచనలు, పద్ధతులను సూచించాలని గ్రేటర్ పిలుపునిచ్చింది.
ప్రజల భాగస్వామ్యంలో కొత్త ఆవిష్కరణలు
మెరుగైన శానిటేషన్ నిర్వహణలో ప్రజల సరికొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసే ప్రయత్నానికి గ్రేటర్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న వరంగల్లో జీరో డంపింగ్ లక్ష్యం సాధించాలన్న సంకల్పంతో అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్లు, స్వచ్ఛంద సంస్థల నుంచి శానిటేషన్ నిర్వహణ కోసం సాంకేతికత సలహాలు, శానిటేషన్ సమస్యలకు పరిష్కారాలు, సూచనలు చేయాలని కోరుతున్నారు. సాలిడ్, లిల్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రియల్ టైమ్ మానిటరింగ్, శానిటేషన్పై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మొబైల్ అప్లికేషన్, వెబ్ ప్లాట్ఫారం అంశాలను వివరిస్తూ సరికొత్త ఆవిష్కరణలు పంపించాలని సూచిస్తున్నారు. గ్రేటర్ను జీరో డంపింగ్ నగరంగా మార్చేందుకు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ రీ సైక్లింగ్, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, పారదర్శక పారిశుధ్యం, వ్యర్థ్యాల నిర్వహణ, రీ సైక్లింగ్ అంశాలపై సరికొత్త ప్రతిపాదనలను ప్రజల నుంచి ఆశిస్తున్నారు.
కొత్త వాగ్దానం పేరుతో సాంకేతిక చాలెంజ్ పోటీ
గ్రేటర్ అధికారులు ‘నగరానికి కొత్త వాగ్దానం’ పేరుతో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్ఛ సాంకేతిక చాలెంజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి సరికొత్త ప్రతిపాదనలు ఆహ్వానించే పోటీలను గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ప్రకటించారు. డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల వరకు మెరుగైన పారిశుధ్య నిర్వహణలో సాంకేతికతను జోడించి సరికొత్త ప్రతిపాదనలు పంపించాలని కోరారు. ఉత్తమ ప్రతిపాదనలకు బహుమతులు అందజేయనున్నారు. మొదటి ఉత్తమ ప్రతిపాదనకు రూ.15 వేలు, రెండో ఉత్తమ ప్రతిపాదనకు రూ.10 వేలు, మూడో ఉత్తమ ప్రతిపాదనకు రూ. 5 వేల నగదు బహుమతి అందజేస్తామని అధికారులు ప్రకటించారు. స్వచ్ఛ సాంకేతిక చాలెంజ్ పోటీలో సరికొత్త ప్రతిపాదనలు పంపించాలనుకునే వారు publichealth.gwmc@gmail. comకు సమర్పించాలని, వివరాల కోసం 97041162 15 నంబర్లో సంప్రదించాలని అధికారులు కోరారు.