ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి
15 కిలోమీటర్ల మేర నిర్మాణం
డీపీఆర్ రూపొందించిన మహా మెట్రో
సగం చొప్పున భూ, ఆకాశ మార్గం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదమే తరువాయి
వరంగల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్లో నియో మెట్రో ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. హైదరాబాద్కు దీటుగా నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కీలకమైన ప్రాజెక్టును తీసుకొస్తోంది. త్వరలో మెట్రో పరుగులు తీస్తుందని ఇటీవల మంత్రి కేటీఆర్, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగానే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కాజీపేట నుంచి వరంగల్ వరకు ఏడు కి.మీ భూమార్గం, ఎనిమిది కి.మీ ఆకాశమార్గంలో మొత్తం 15కిలోమీటర్ల మేర ఉండేలా మహా మెట్రో సంస్థ రూపొందించిన డీపీఆర్ను ఇటీవలే కేంద్రానికి పంపగా పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం పొందిన మరుక్షణమే పనులు మొదలుకానున్నాయి.
చారిత్రక నగరం వరంగల్ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. వరంగల్ను వైద్య, విద్య, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికను అమలుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి వరంగల్ పర్యటనలో ప్రకటించారు. హైదరాబాద్కు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా వరంగల్లో నియో మెట్రోను ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయించారు. వరంగల్లో త్వరలోనే నియో మెట్రో పరుగులు తీస్తుందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ రెండు నెలల క్రితం వరంగల్కు వచ్చినప్పుడు ప్రకటించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటనలకు అనుగుణంగా వరంగల్లో నియో మెట్రో నిర్మాణానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ నియో మెట్రో నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఈ డీపీఆర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం వచ్చిన వెంటనే వరంగల్లో నియో మెట్రో నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది.
మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్(మహా మెట్రో) ఈ మేరకు ఇటీవల సమగ్ర ప్రాజెక్టును సిద్ధం చేసింది. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండేలా కొత్త రకంగా ఈ డీపీఆర్ను రూపొందించారు. వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మహా మెట్రో సంస్థ వరంగల్ నియో మెట్రో ప్రాజెక్టును సిద్ధం చేసింది. నగర ప్రస్తుత జనాభా 12లక్షలు ఉంది. 2,041 వరంగల్ మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా నియో మెట్రో డీపీఆర్ సిద్ధమైంది. అప్పటికి మహానగర జనాభా 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్లో మహా మెట్రో సంస్థ మెట్రో రైలు ప్రాజెక్టులను రూపొందించింది. 20 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉన్న నాసిక్ తరహా విధానం సరిపోతుందనే అంచనాతో వరంగల్ నియో మెట్రో డీపీఆర్ ఉంది. వరంగల్ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నగరానికి మరో కీలక ప్రాజెక్టును తెస్తోంది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో మెట్రో రైలును నిర్వహించాలని నిర్ణయించింది.
ఈమేరకు నియో మెట్రో సంస్థ రూపొందించిన ప్రాజెక్టు ఇక్కడ పూర్తిస్థాయిలో ఆమోదయోగ్యంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల నియో మెట్రో మార్గం ఉండేలా ప్రతిపాదనలు ఉన్నాయి. భూసేకరణ ఖర్చులతో ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో ఆకాశమార్గంలోనే నిర్మించాలని సూచనలు వచ్చాయి. పూర్తిగా ఆకాశ మార్గంలో కాకుండా ఏడు కిలోమీటర్లు భూమార్గంలో, ఎనిమిది కిలోమీటర్లు ఆకాశమార్గంలో నిర్మాణం చేపట్టేలా డీపీఆర్ రూపొందించారు. సాధారణ విధానం కంటే ఈ విధానంలో నియో మెట్రో నిర్మాణం వల్ల రెండు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని మహా మెట్రో సంస్థ పేర్కొంది. సాధారణ విధానంలో కిలోమీటరు మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రూ.180 కోట్లు ఖర్చవుతుందని కొత్త విధానం ప్రకారం కిలోమీటరుకు రూ.60 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్లో పేర్కొన్నారు. కొత్త విధానంతో నిర్మాణం వల్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుందని మహా మెట్రో తెలిపింది. సాధారణంగా మెట్రో నిర్వహణలో కిలోమీటరుకు 35 మంది అవసరమైతే… కొత్త విధానంలో 15 మంది సరిపోతారని పేర్కొంది. నియో మెట్రో విధానంలో కొత్త టెక్నాలజీని అనుసరిస్తారు. ఈ విధానంలో రబ్బరు టైర్లపై నడిచే ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారు. వరంగల్లోని ప్రధాన రోడ్లు నియో మెట్రో ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయనే అంచనాతో మహా మెట్రో సంస్థ ఈ విధానాన్ని ప్రతిపాదించింది.