తెలుగు యూనివర్సిటీ, జూలై 14. : సింగరేణికి కొత్త గనుల ఆవశ్యకత అత్యంత తీవ్రంగా ఉన్న దశలో కొత్తగా తాడిచర్ల-2బ్లాక్కు మైనింగ్ లీజు అనుమతులు లభించడం ఒక వరంలాంటిదని కంపెనీ కో-ఆర్డినేషన్, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ టీ శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాడిచర్ల-2 బ్లాక్ సాధన విజయోత్సవ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాత గనులు మూతపడుతున్న ప్రస్తుత తరుణంలో కొత్త గనులను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, గడిచిన ఏడాది ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నైని బొగ్గు బ్లాకుకు పూర్తి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని, ఇప్పుడు మైనింగ్ లీజు పొందిన తాడిచర్ల-2 బ్లాక్ను కూడా అనతి కాలంలోనే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
సింగరేణి ప్రాంతంలో ఉన్న ఇతర బొగ్గు బ్లాకులు కూడా సంస్థకు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొత్త బ్లాకుల రాకతో సింగరేణికి పూర్వ వైభవం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాడిచర్ల బ్లాకు నుండి ప్రతి ఏడాదీ కనీసం 60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నదని, ఈ విధంగా 45 సంవత్సరాల పాటు ఈ గనిలో ఉత్పత్తి కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.