ముందస్తు మొక్కులకు భారీగా వచ్చిన భక్తులు
దర్శించుకున్న 3 లక్షల మంది
గ్రిల్స్కు తాళాలు వేయడంతో బయటి నుంచే మొక్కులు
నిండిన జాతర పరిసరాలు
తాడ్వాయి, జనవరి 23 :వనదేవతల సన్నిధి మేడారం ఆదివారం జనసంద్రమైంది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజే సుమారు 3లక్షల మంది ముందస్తు మొక్కులు చెల్లించారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు. నెత్తిన బెల్లంబుట్టలు ఎత్తుకుని గద్దెల వద్దకు బైలెల్లారు. సమ్మక్క – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులు భారీగా తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్కు అధికారులు ఉదయం 10గంటల తర్వాత తాళాలు వేశారు. దీంతో బయటి నుంచే దర్శించుకున్నారు.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం ఆదివారం జన సంద్రంగా మారింది. ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులతో జాతర పరిసరాలు పూర్తిగా నిండాయి. ఈ ఒక్కరోజే సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు రావడం ఉదయం నుంచే ప్రారంభమై సాయత్రం వరకు కొనసాగింది. తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించారు. నెత్తిన ఎత్తుబెల్లం పెట్టుకుని అమ్మవార్ల గద్దెల వద్దకు బయల్దేరారు. సమ్మక్క – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించారు. కోర్కెలు తీర్చాలి తల్లీ అంటూ వేడుకుంటూ యాటపోతులను, కోళ్లను సమర్పించి జాతర పరిసరాల్లో విందు భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
గ్రిల్స్కు తాళాలు
వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం భక్తులకు నేరుగా అమ్మవార్ల గద్దెలను తాకి దర్శించుకునే అవకాశం కల్పించారు. 10 గంటల నుంచి ఒక్కసారిగా భక్తుల రాక పెరిగింది. దీంతో తోపులాట జరగకుండా గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్కు తాళాలు వేశారు. బయటి నుంచే దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ను పరిశీలించిన ఎస్పీ
జాతర పరిసరాల్లో ట్రాఫిక్ను ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ పరిశీలించారు. జంపన్నవాగు ప్రధాన రహదారితోపాటు గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలుగుట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గద్దెలకు సమీపంలో వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
తాడ్వాయి, జనవరి 23 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సమీపిస్తున్నందున చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మేడారంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న షెడ్స్లో విడిది చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలన్నారు. గెస్ట్హౌస్, అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఈఓ రాజేంద్రం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.