రూ.5.8కోట్లతో స్విమ్మింగ్ పూల్, మినీ స్టేడియం నిర్మాణం
సీఎస్ఆర్, టీయూఎఫ్ఐడీసీ నిధుల కేటాయింపు
మున్సిపల్ ఎలక్షన్ హామీని నెరవేర్చుతున్న ఎమ్మెల్యే గండ్ర
శరవేగంగా కొనసాగుతున్న గ్రౌండ్ లెవలింగ్ పనులు
మంత్రి కేటీఆర్తో శంకుస్థాపనకు సన్నాహాలు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ త్వరలో అందుబాటులోకి రానుంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నెరవేర్చుతున్నారు. జిల్లా కేంద్రంలో 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో రూ.5.8కోట్లతో స్విమ్మింగ్ పూల్, మినీస్టేడియం నిర్మిస్తున్నారు. రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో స్విమ్మింగ్ పూల్, రూ.4.5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మినీ స్టేడియం పనులు చేపట్టారు. ఈనెల 6న ఎమ్మెల్యే పనులను ప్రారంభించగా గ్రౌండ్ లెవలింగ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలకు దీటుగా మారుమూల జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్, మినీస్టేడియం నిర్మిస్తున్నా రు. ప్రస్తుతం లెవలింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2020లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి, చైర్మన్ స్థానం కైవశం చేసుకుంటే జిల్లా కేంద్రంలో స్విమ్మింగ్ పూల్, మినీ స్టేడియం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గెలిపించడంతో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంలో ఎక్కువ జనసమూహాలు నివసించే ప్రాంతాల సమీపంలో సుమారు 5 ఎకరాల విశాల స్థలంలో వీటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రూ.5.8కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల సువిశాలమైన స్థలంలో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం రూపుదిద్దుకుంటున్నది. ఇందులో భాగంగా రూ.5.8కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, మినీస్టేడియం నిర్మిస్తున్నారు. రూ.కోటి సీఎస్ఆర్ నిధులతో స్విమ్మింగ్ పూల్, రూ.4.5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మినీ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బస్ డిపో, డిగ్రీ కళాశాల, పోలీస్ హెడ్ క్వార్టర్స్తోపాటు పలు కాలనీలు విస్తరించిన చోట వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
శరవేగంగా చదును పనులు
జిల్లా కేంద్రంలో నిర్మించనున్న స్విమ్మింగ్ పూల్, మినీ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను ఈనెల 6వ తేదీన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి గ్రౌండ్ లెవలింగ్ పనులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని టిప్పర్ అసోసియేషన్ సహకారంతో గ్రౌండ్ లెవలింగ్ కోసం మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.30లక్షలను కేటాయించారు.
కేటీఆర్తో శంకుస్థాపనకు సన్నాహాలు
స్పోర్ట్స్ కాంపెక్స్ నిర్మాణానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో శంకుస్థాపన చేయించేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 17న శంకుస్థాపన చేయాల్సి ఉండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. త్వరలోనే భూమిపూజ చేయడంతోపాటు జిల్లాలో మరిన్ని ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు.