రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడిపల్లి సునీత
పట్టా పాస్ బుక్ కోసం దివ్యాంగ రైతు నుంచి రూ.3లక్షలు డిమాండ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కలకలం
కాటారం, జూలై 22 : ఆన్లైన్లో పట్టా పాస్ బుక్ కోసం దివ్యాంగుడి వద్ద నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ మేడిపల్లి సునీత బుధవారం పట్టుబడ్డారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం సుందర్రాజ్పేట గ్రామానికి చెందిన ఐత హరికృష్ణ హైదరాబాద్లో ఉంటున్నాడు. అతడికి కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్ 3లో 4 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నది. సదరు భూమిని గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ధరణి పోర్టల్లో ఎక్కించి డిజిటల్ సంతకం చేసిన కొత్త పట్టా పాస్ బుక్ కోసం హరికృష్ణ తన బావ చల్ల రాజేశంతో కలిసి కొన్ని రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. భూమి వివాదంలో ఉన్నదని, ఆన్లైన్లో పట్టా పాస్ బుక్ కావాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ సునీత డిమాండ్ చేసింది. చివరకు రూ.3లక్షలకు ఒప్పందం కుదిరింది. తొలుత తహసీల్దార్ సునీతకు రూ.50వేలు అప్పజెప్పాడు. మిగతా డబ్బులు పూర్తిగా ఇస్తేనే ఆన్లైన్లో ఎక్కిస్తానని చెప్పడంతో సదరు బాధితుడు ఈ నెల 12న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
గురువారం తహసీల్దార్కు రూ.2లక్షలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీతకు హరికృష్ణ రూ.2లక్షలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తన సిబ్బందితో కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ చేయగా ఆ డబ్బులు హరికృష్ణ నుంచి తీసుకున్నవేనని తేలిందని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలో తహసీల్దార్ రూ.2లక్షలు తీసుకున్నట్లు స్పష్టంగా రికార్డయిందన్నారు. దీంతో మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ మహిళా సిబ్బందితో కలిసి తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ఆమెను హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు శ్యాంసుందర్, క్రాంతికుమార్, శ్రీను పాల్గొన్నారు.