ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 16 ఏళ్లుగా ఫౌండేషన్ కృషి
‘బడి మనదే.. బాధ్యత మనదే’ నినాదంతో కొత్త ఒరవడి
‘గ్రామ జ్యోతి’ స్ఫూర్తితో 300 స్కూళ్లలో స్టడీ సెంటర్ల ఏర్పాటు
తొర్రూరు, జనవరి 21 ;విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేది బడి.. సమాజ పురోభివృద్ధికి కేంద్రాలైన పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. నాడు పట్వారీ, పాలేరు అన్న తేడా లేకుండా వారి పిల్లలందరికీ సర్కారు బడుల్లోనే సమాన విద్యావకాశాలు లభించాయి. ఎప్పుడైతే ‘కార్పొరేట్ విద్య’ పట్టణాల నుంచి పల్లెలకు పాకిందో అప్పటినుంచే ప్రతి కుటుంబ విద్యావ్యవస్థ చిన్నాభిన్నమై అనారోగ్యరకర పోటీ తీవ్రమైంది. లేని ఆశలను రేకెత్తించి ఆర్థిక అసమానతలను పెంచింది. ఆర్థికంగా ఉన్నవారు కార్పొరేట్ సంస్థల బాట పడితే లేనివారికి ప్రభుత్వ పాఠశాలలే ఆశాదీపాలుగా మిగిలాయి. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలని అర్హత, అనుభవమున్న ఉపాధ్యాయులను నియమించి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నా పర్యవేక్షణా లోపం, ప్రజల ఆలోచనలకు తగ్గ జవాబుదారీతనం లోపించిన కారణంగా ఒకనాడు పల్లెలకు వెలుగునిచ్చిన ప్రభుత్వ బడుల ప్రభ క్రమంగా మసకబారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్కారు బడులకు జవసత్వాలు తేవడంతో పాటు తాజాగా విద్యా వ్యవస్థ బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ పేరిట వేసిన ముందడుగుపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
బడుగుల జీవితాలు.. వెలుగుల వైపు
సమగ్ర విద్యాభివృద్ధితోనే సుస్థిర తెలంగాణ సాధ్యమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ పేరుతో ప్రతిష్టాత్మకమైన విద్యా ప్రాజెక్టుకు శ్రీకారం చూట్టారు. 27లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసుతులు, విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధనతో ప్రపంచ శ్రేణి విద్యా విధాన రూపకల్పనకు వ్యూహ రచన చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ విద్యా వ్యవస్థను గాడినపెట్టేందుకు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తానని ఉద్యమ సందర్భంలోనే ప్రకటించి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 300కు పైగా గురుకులాలను ఏర్పాటు చేసి అనతికాలంలోనే మూడు రెట్లకు పైగా అంటే వెయ్యి గురుకులాలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ప్రకటించిన ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తో పాటు దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై అపారమైన నమ్మకంతో ఉన్న బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందని విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. గురుకులాల స్థాపనతో ఇప్పటికే ఆరు లక్షల కుటుంబాల్లో అక్షర జ్యోతులు విరజిమ్మాయి.
సీఎంకు ఉత్తర నీరాజనం
ప్రభుత్వ బడుల బాగుకోసం విద్యాభిమానులతో కలిసి 16ఏళ్లుగా వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న అక్షర యజ్ఞానికి ప్రాణం పోసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ పేరుతో తీసుకుంటున్న కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి సంకల్పానికి గ్రామ విద్యాభివృద్ధి కమిటీల సభ్యులు, పూర్వ విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. వేలాది మంది విద్యార్థుల కుటుంబాల పక్షాన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగానే లక్ష మంది విద్యార్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతా పూర్వకంగా ఉత్తరాలు రాయిస్తూ ఉత్తర నీరాజన కార్యక్రమం చేపట్టాలని సంకల్పించాం. ప్రభుత్వ విద్య బలోపేతానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వందేమాతరం ఫౌండేషన్ ఆశయాలకు తగినట్లు ఉండడం, మంత్రి దయాకర్రావు, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఫోన్ చేసి సమాచారం ఇస్తూ అభినందించడం ఎంతో సంతృప్తి కలిగించింది.-రవీంద్ర, ఫౌండేషన్ డైరెక్టర్
విద్యాయజ్ఞంలో ఓరుగల్లు నేతలు, అధికారుల పాత్ర..
వందేమాతరం ఫౌండేషన్ విద్యా యజ్ఞానికి ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన వాకాటి కరుణ, రోనాల్డ్రాస్, దేవసేన తదితర అధికారులు బాసటగా నిలిచారు. పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో నాలుగేళ్ల క్రితమే ‘మన బడి-మన బాధ్యత’ పేరిట గ్రామాలు, మండల స్థాయిలో సదస్సులు నిర్వహించి ముత్తారం, చెన్నూరు, తొర్రూరు, చెర్లపాలెం, అమ్మాపురం, కంఠాయపాలెం పాఠశాలల్లో ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు సమకూర్చి విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి ఉన్న సందర్భంలో ఒంటిమామిడిపల్లి బడిని రాష్ట్రంలోనే మొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా ప్రారంభింపజేశారు. ఆ తర్వాత మరో 300 ప్రాథమిక పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చే ప్రక్రియలో ఫౌండేషన్ కీలక సూచనలు అందించింది. అప్పటి మహబూబ్నగర్ కలెక్టర్ రోనాల్డ్రాస్ ‘ఇంటికి వంద-బడికి చందా’ పేరుతో ప్రజలను భాగస్వాములను చేస్తూ రూ.6కోట్ల నిధులు సేకరించి వివిధ పాఠశాలకు వెచ్చించారు. వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ డైరెక్టర్ రవీంద్రకు ఉత్తమ విద్యాసంస్థ అవార్డును ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2లక్షల నగదుతో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు సంస్థకు ఎంతో స్ఫూర్తినివ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో 150 గ్రామాల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలను పెంచి రెండేళ్ల పాటు ఇంగిష్ మీడియంలో బోధన చేయించి అక్షరాభ్యాసం, అక్షర దీపావళి, ప్రతిభా పురస్కారాల ప్రదానం, పదో తరగతి ప్రేరణ సదస్సులు, పాఠశాలల వార్షికోత్సవాలు నిర్వహించింది.
ఇదేబాటలో 16ఏళ్లుగా ‘వందేమాతరం ఫౌండేషన్’
కార్పొరేట్ కబంధహస్తాల నుంచి ప్రభుత్వ బడిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంగా పని చేస్తున్న వందేమాతరం ఫౌండేషన్ ‘బడి మనదే-బాధ్యత మనదే.. ఉద్యమంగా కదులుదాం-ఊరి బడిని కాపాడుకుందాం’ అనే నినాదంతో సంస్థ డైరెక్టర్ రవీంద్ర నేతృత్వంలో 16ఏళ్లుగా అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. జీవితాన్నిచ్చిన బడి రుణం తీర్చుకునేందుకు గ్రామస్థులందరితో విద్యాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రవాస భారతీయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడే ఉపాధ్యాయులను ఆదరిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘గ్రామ జ్యోతి’ స్ఫూర్తిగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 300 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశారు.