ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లా సురేందర్రెడ్డి
ఐఎంఏలో వ్యాక్సినేషన్ శిబిరం
సభ్యులు, కుటుంబాలు వినియోగించుకోవాలని సూచన
వరంగల్ చౌరస్తా, జనవరి 19: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వరంగల్ విభాగం ఆధ్వర్యంలో సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం ప్రికాషన్ డోస్ అందించేందుకు బుధవారం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ నల్లా సురేందర్రెడ్డి హాజరై మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా బాధితులకు వైద్య సేవలు అందించే సభ్యుల అవసరాలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఐఎంఏ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ప్రికాషన్ డోస్ వాక్సిన్ వేసుకోవాలని కోరారు. వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండేందుకు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్లో సభ్యుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐఎంఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగానే ఈ ప్రికాషన్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మరో నాలుగు రోజులపాటు కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే లలితాదేవి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రికాషన్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మధన్మోహన్రావు, వరంగల్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బీ బాలాజీ, కార్యదర్శి డాక్టర్ నాగార్జునరెడ్డి, కోశాధికారి డాక్టర్ సనత్కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.