మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపు
జిల్లాలో 432 పాఠశాలలు
దశలవారీగా పనుల నిర్వహణ
సమాచారం సేకరిస్తున్న అధికారులు
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన
జయశంకర్ భూపాలపల్లి, జనవరి19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం తాజాగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.7,289 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. జిల్లాలో 432 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, సరిపడా ఫర్నిచర్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల నిర్మాణం వంటి పనులు చేయనున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించారు. దీనికి తోడు వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయి ఆంగ్ల విద్యను ప్రారంభించనుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగంలో సమూల సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం తాజాగా ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమానికి రూపకల్పన చేసి, ప్రత్యేక నిధులిచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. సీమాంధ్రుల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యారంగాన్ని గాడిన పెట్టేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పాఠశాలల ప్రారంభం నాటికే విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు.., రెండు జతల ఏకరూప దుస్తులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లల్లో వారానికి 3 రోజులు గుడ్డు, నాన్వెజ్తో పౌష్టికాహారం అందిస్తున్నారు. బడులను మరింత బలోపేతం చేయాలనే ఆకాంక్షతో ఎక్కడాలేని విధంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి బడుల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. జిల్లాలో 432 పాఠశాలలు ఉండగా, ‘మన ఊరు- మన బడి’తో వాటి రూపురేఖలు మారనున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఎంపీడీవోల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల సమాచారాన్ని సేకరిస్తున్నది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత?, టీచింగ్.., నాన్ టీచింగ్ సిబ్బంది సంఖ్య.. అందుకనుగుణంగా మరుగుదొడ్లు ఉన్నాయా..?, వాటిలో వాడకంలో ఉన్నవి ఎన్ని.., పని చేయనివి ఎన్ని.., మరమ్మతు అవసరమైనవి ఎన్ని?, కొత్తగా ఎన్ని నిర్మించాలి.. అనే సమాచారం అధికారుల ద్వారా తీసుకుంటున్నారు. వీటితో పాటు విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నీచర్, పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ ఏర్పాటు వంటి వివరాలు సేకరిస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే చాలా పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల బోధనను అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రస్తుతం మోడల్ స్కూల్, కేజీబీవీల్లో అమలవుతుండగా అది విజయవంతమైంది. దీంతో వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు వరం
ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మనఊరు-మన బడి’ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, పాఠశాలలకు వరం లాంటిది. ఈ విధానంతో పాఠశాలలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమిటీలో విద్యాభివృద్ధికి సహకరించిన విద్యాభిమానులను, దాతలను చేర్చితే మరింత పటిష్టంగా కార్యక్రమం అమలవుతుంది.
–రేగూరి సుభాకర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, జయశంకర్ భూపాలపల్లి