వరంగల్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాకు రానున్నారు. వడగండ్లతో ఎక్కువ నష్టం వాటిల్లిన నర్సంపేట, పరకాల డివిజన్లలోని పలు మండలాల్లో సీఎం పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ నెల 10, 11వ తేదీల్లో పడిన వడగండ్ల వానలతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు 37వేల ఎకరాల్లో పంటలకు అపార నష్టం కలిగింది. మిరప, మక్క, పల్లి, జొన్న, అరటి, బొప్పాయి, మినుము, పెసర, ఆవు బఠాణీ, ఆవాలు, కూరగాయలు, పండ్ల తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. జరిగిన నష్టంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్కు వివరించగా తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశమై సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
అన్నదాతపై ప్రకృతి మరోసారి పగబట్టింది. అకాలంలో వచ్చిన వానలు రైతును నిండా ముంచాయి. వాయుగుండం కారణంగా ఈ నెల 11 నుంచి కురిసిన భారీ వానలకు, రాళ్ల వానలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిరప, మక్కజొన్న, అరటి, పుచ్చకాయ, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన మిరప పంట మొత్తం నేలపాలైంది. మంచి ధర ఉందని సంతోషంతో ఉన్న మిరప రైతులను వానలు కుదేలు చేశాయి. మిరప పంట మొత్తం రాలిపోయింది. నీళ్లలో కొట్టుకుపోయింది. చేతికి వచ్చే పరిస్థితి లేకుండా కాయలతోపాటు మొక్కలు నేలమట్టమయ్యాయి. పెట్టుబడిగా పెట్టిన లక్షల రూపాయలు కండ్ల ముందే నీళ్ల పాలవడంతో మిరప రైతులకు కన్నీళ్లే మిగిలాయి. మక్కజొన్న పంటకు ప్రస్తుత రాళ్ల వానలు బాగా నష్టం జరిగింది. రాళ్లు, ఈదురుగాలుల ప్రభావంతో మక్కజొన్న కర్రలు వంగిపోయాయి. మనిషి ఎత్తు ఉన్న చేను సగానికి విరిగి కింద పడిపోయింది. కంకులు పోసే దశలో వానలు వచ్చి రైతులను నిండా ముంచా యి. యాసంగిలో కూరగాయలు సాగు చేసిన రైతులు వానలతో చాలా నష్టపోయారు. టమాట, క్యాబేజీ, వంకాయ, బెండకాయ, గోరు చిక్కుడుకాయ, చిక్కుడు, ఆకుకూరలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్తిమీర, పుదీనా, మెంతికూర పంటలు ఆనవాలు లేకుండా అయ్యాయి. అరటి పంటల రైతులు తాజా వానలతో బాగా నష్టపోయారు. గెలలు తెంపే సమయంలో ఈ వానలు రావడంతో చెట్లు నేలవాలాయి. ఇలా చేతికి వచ్చిన పంటలన్నీ వాన పాలయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సంక్రాంతి సమయంలో వానలు రావడం వింతగానే ఉందని, పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వానలు పడ్డాయి. అన్ని మండలాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. తాజా వానలతో పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖ నివేదికలు వేర్వేరుగా నివేదికలు రూపొందించాయి. 33శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన పంటలను గుర్తించి నివేదికలో పేర్కొన్నాయి. అన్ని పంటలు కలిపి జిల్లావ్యాప్తంగా 9,988 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ వానలతో 7,783మంది రైతులు నష్టపోయారు. ఎక్కువగా మిరప పంట దెబ్బతిన్నది. 4,928 ఎకరాల్లో ఈ పంట దెబ్బతిన్నది. 3,568 మంది మిరప సాగు చేసిన రైతులు పెట్టుబడి సైతం కోల్పోయిన పరిస్థితి నెలకొంది. 4,913 ఎకరాల్లో మక్కజొన్న పంట నేలపాలైంది. ఈ పంట సాగు చేసిన 4,131 మంది రైతులు నష్టపోయారు. 116 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతినడంతో 66 మంది రైతులు నష్టపోయారు. 21 ఎకరాల్లో అరటి, ఐదు ఎకరాల్లో పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయి. ఆత్మకూరు మండలంలో వానల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మండలంలో 3,447 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఈ ఒక్క మండలంలోనే 3,040 మంది రైతులు నష్టపోయారు. నడికూడ మండలంలో 3,485 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 2,485 మంది రైతులు నష్టపోయారు. పరకాల మండలంలో 1,601 ఎకరాల్లో పంటలు దెబ్బతిని 1,120 మంది రైతులు నష్టపోయారు. పంట నష్టం అంచనాలపై వ్యవసాయ శాఖ మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు సేకరిస్తోంది. తుది నివేదిక ప్రకారం పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించనుంది.
భూపాలపల్లి జిల్లాలో 1,399 ఎకరాల్లో మిర్చి..
భూపాలపల్లి టౌన్, జనవరి 17 : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,399.8 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయ్భాస్కర్ తెలిపారు. ధాన్యం కోతలు దాదాపు పూర్తవడంతో వరికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. వర్షాలతో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో మండల వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో సర్వే చేయించి పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. మొత్తం 2,137 మంది రైతులు 1399.8 ఎకరాల్లో మిర్చి పంటను నష్టపోయారని వివరించారు. అత్యధికంగా మల్హర్, కాటారం, రేగొండ, భూపాలపల్లి మండలాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. భూపాలపల్లి మండలంలో 184 ఎకరాల్లో 246మంది రైతులు, గణపురం మండలంలో 84 ఎకరాల్లో 125 మంది రైతులు, రేగొండ మండలంలో 180 ఎకరాలు, 245 మంది రైతులు, చిట్యాల మండలంలో 138 ఎకరాలు 295 మంది రైతులు, టేకుమట్ల 82.8 ఎకరాలు 189 మంది రైతులు, మొగుళ్లపల్లి మండలంలో 192 ఎకరాలు 264మంది రైతులు , కాటారం మండలంలో 96.6 ఎకరాల్లో 143మంది రైతులు, మహదేవ్పూర్ మండలంలో 170 ఎకరాల్లో 265 మంది రైతులు, పలిమెలలో 33 ఎకరాల్లో 43మంది రైతులు, మల్హర్ మండలంలో 190 ఎకరాల్లో 254 మంది రైతులు, మహాముత్తారం మండలంలో 49.4 ఎకరాల్లో 68 మంది రైతులు మిర్చి పంట నష్టపోయారని డీఏఓ వివరించారు.
వరంగల్లో అత్యధికంగా 26వేల ఎకరాలు
వరంగల్, జనవరి 17(నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలు వరంగల్ జిల్లా తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో మిర్చి పంట మక్క, మక్కజొన్న తుడిచిపెట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లగా వేరుశనగ, జొన్న, అరటి, బొప్పాయి, మినుము, పెసర, ఆవు బఠాని, ఆవాలు, కూరగాయలు, ఇతర పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, సంగెం, గీసుగొండ, వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని 191 గ్రామాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించగా జిల్లాలో మొత్తం 26,376 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 21,522 మంది రైతులకు నష్టం వాటిల్లగా 11,664 మంది రైతులు మిర్చి పంటను పూర్తిగా కోల్పోయినట్లు ఉద్యానశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది రైతులు 19,057 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే ఇందులో ఎక్కువభాగం 14,686 ఎకరాలు వడగండ్ల వానకు కొట్టుకుపోయింది.
ములుగు జిల్లాలో 3,045 ఎకరాల్లో మిర్చి
ములుగు, జనవరి 17(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో మిర్చి రైతులకు అపార నష్టం వాట్లిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.ఏ.గౌస్ హైదర్ తెలిపారు. 3,045 ఎకరాల్లో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అలాగే 200 ఎకరాల్లో మక్క, వంద ఎకరాల్లో పెసర, మినుము నష్టం సంభవించిందని తెలిపారు. వెంకటాపురం(నూగూరు) మండలంలో అత్యధికంగా 745 ఎకరాల్లో, ములుగు మండలంలో అత్యల్పంగా 45 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది.