బడుల బలోపేతం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ
అక్టోబర్ 1 నుంచే ప్రారంభమైన కార్యక్రమాలు
ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ద్వారా నిర్వహణ
పర్యవేక్షిస్తున్న డీఈవోలు
భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 13 : విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిష్ట 3.0 పేరిట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచే శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 328 ప్రాథమిక పాఠశాలల్లో బోధించే 900 మంది ఎస్జీటీలకు ఆరు నెలల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. డీఈవోలు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించినప్పటికీ విద్యార్థులు ఆశించిన స్థాయిలో చదవలేక పోతున్నందున విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిష్ట 3.0 ( నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ) పేరుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఆరు నెలల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. డీఈవోలు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా నుంచి 900 మంది ఉపాధ్యాయులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 328 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 900 మంది ఉపాధ్యాయులకు నిష్ట 3.0 ఆన్లైన్ శిక్షణ ప్రారంభమైంది. ఉపాధ్యాయులకు బోధనాసామర్థ్యం పెంచడం, విద్యార్థులతో ప్రొపైల్ తయారు చేయించడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, అంగ్లంలో ప్రావీ ణ్యం, పాఠశాల కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యం, విద్యార్థులతో పటాల తయారీ, తదితర అంశాలపై నిష్ణాతులైన ఆర్పీల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆరు నెలల పాటు జరిగే ఈ శిక్షణకు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి నెలలో రెండు మాడ్యుల్స్ చొప్పున ఆరు నెలలకు 12 మాడ్యుల్స్ ఉంటాయి. ఏ నెల మాడ్యుల్స్ అదే నెలలో పూర్తి చేయాలి. కోర్సు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ కూడా అందజేస్తారు.
బడుల బలోపేతమే లక్ష్యం
ప్రతి విద్యార్థికి ప్రాథమిక దశ చాలా కీలకమైనది. ఇక్కడ తెలుగు, ఆంగ్లం భాషలపై పట్టు సాధించాలి. ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందితేనే ఉన్నత పాఠశాలల్లో సులభంగా చదువగలరు. ప్రాథమిక దశలో ఆశించిన స్థాయిలో బోధన జరగడం లేదని విద్యాశాఖ గుర్తించింది. దానికి తోడు కరోనా పరిస్థితుల నేపథ్యంలో సుమారు 18 నెలల పాటు పాఠశాలలు మూసి ఉండడంతో విద్యార్థులకు బేసిక్ కూడా సరిగారావడం లేదు. కావున ఈ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిష్ట 3.0 పేరుతో శిక్షణ కొనసాగుతున్నది. ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ద్వారా నిష్ణాతులైన ఆర్పీలు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ వల్ల ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్ ఇస్తారు.
-హరికృష్ణ, సెక్టోరియల్ అధికారి భూపాలపల్లి